సీఎల్ పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢుమ్మా: హైకమాండ్ కు షాక్: ఆపరేషన్ కమల!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో అసమ్మతి ఉందని మరోసారి వెలుగు చూడటంతో కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల ప్రభుత్వం అధికారంలో ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానం మొదలైయ్యింది. అయితే కాంగ్రెస్ శాసన సభ్యుల్లో ఎలాంటి అసమ్మతిలేదని ఆ పార్టీ నాయకులు పైకి అంటున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బెంగళూరులోని ప్రైవేట్ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.
అసమ్మతి లీడర్స్
కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన గోకాక్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, బెంగళూరు నగరంలోని శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, ముళబాగిల్ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే హెచ్. నాగేష్ శాసన సభాపక్ష సమావేశానికి హాజరుకాలేదు. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.
కిలాడీ లీడర్స్
ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేశారని మరోసారి వెలుగు చూసింది. ఇక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ మాజీ సీఎం సిద్దరామయ్య, దినేష్ గుండూరావ్ మీద విరుచుకుపడ్డారు. అంతే కాకుండా కేసీ. వేణుగోపాల్ ఒక బఫూన్ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని రోషన్ బేగ్ బహిరంగంగా పిలుపునిచ్చారు.
బీజేపీ గాలం?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి తన అనుచరులతో బీజేపీలో చేరుతున్నారని చాలకాలం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. రమేష్ జారకిహోళి కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి హాజరుకాకపోవడంతో ఆ అనుమానం మరింత బలపడింది. ముళబాగిల్ స్వతంత్ర పార్టీ శాసన సభ్యులు హెచ్. మహేష్ మంత్రి డీకే. శివకుమార్ తో భేటీ అయ్యి చర్చించారు. అయితే ఎమ్మెల్యే మహేష్ సైతం శాసన సభ్యుల సమావేశానికి హాజరుకాలేదు.
హైకమాండ్ ఆరా!
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు కేసీ. వేణుగోపాల్ బెంగళూరు చేరుకుని ఆ పార్టీ శాసన సభ్యుల సమావేశం నిర్వహించారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు హైకమాండ్ ఆదేశాలను లెక్కచెయ్యకుండా శాసన సభ్యుల సమావేశానికి ఢుమ్మాకొట్టారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని మరోసారి వెలుగు చూసింది.