ఎబోలా భయం: విమానాశ్రయంలో ముగ్గురి నిలిపివేత
న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆందోళవ చెందుతున్న విషయం ఎబోలా వైరస్. న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మంగళవారం వచ్చిన ముగ్గురు ప్రయాణీకులకు ఎబోలా వైరస్ సోకిందనే సమాచారంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఈ ముగ్గురికి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
మంగళవారం వివిధ దేశాల నుండి సుమారు 112 మంది భారతీయులు ముంబై, న్యూఢిల్లీ విమానాశ్రాయలకు వచ్చారు. ఇందులో కొంత మంది ప్రయాణీకులు మొదట న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చి, ఆ తర్వాత దేశీయ విమానయాన సంస్దల ద్వారా ముంబైకి చేరుకున్నారు. న్యూఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ప్రయాణీకులను తనిఖీలు చేసేందుకు గాను ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త ఏర్పాట్లను తీసుకుంది.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తెలిపిన సమాచారం ప్రకారం ఇథియోపియన్ ఎయిర్ లైన్స్, ఎమిరేట్స్, ఎటిహాడ్, కతర్, జెట్, దక్షిణ ఆఫ్రికా ఎయిర్ వేస్ ద్వారా ప్రయాణీకులు ముంబైకి వస్తున్నట్లు తెలిపింది. ప్రయాణీకుల లగేజిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది.
నైజీరియా నుండి ఆదివారం ముంబైకి వచ్చిన 32 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వైరస్ సోకిందనే అనుమానంతో అతన్ని విమానాశ్రయం నుండి నేరుగా జోగేశ్వరిలోని ఓ ట్రామా కేర్ సెంటర్ కు తీసుకెళ్లి విడిగా ఉంచారు. అతని కళ్లు ఎర్రగా ఉండటంతో పాటు.. జలుబు, జ్వరంతో బాధ పడుతున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ విమానంలో నైజీరియా నుండి దుబాయ్ మీదగా ముంబైకి చేరుకున్నాడు. అతని రక్తనమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్దకు పంపనున్నట్లు వైద్యులు చెప్పారు.