కరోనా రిలీఫ్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక నిర్ణయం, లిమోసైన్ కొనుగోలుకు ‘నో’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని ఏడాదిపాటు 30 శాతం తగ్గించుకున్నారు. అంతేగాక, రాష్ట్రపతి భవన్లో పొదుపు చర్యలను పాటించాల్సిందిగా ఆదేశించారు. దీని ద్వారా పోగైన మొత్తాన్ని కరోనాపై పోరుకు వినియోగించాలని నిర్ణయించారు.
గురువారం ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఖర్చులను తగ్గించడంతోపాటు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా దేశీయ పర్యటనలు, కార్యక్రమాలను తగ్గించుకోవాలని రాష్ట్రపతి నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. డెకరేషన్లను కూడా పరిమితంగా చేయాలని నిర్ణయించారు. అంతేగాక, ప్రత్యేక సందర్భాల్లో వినియోగించే లిమోసైన్(కారు) కొనుగోలును వాయిదా వేశారు.
రాష్ట్రపతి భవన్లో అవసరమైతేనే మరమ్మతులు, నిర్వహణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్లో కాగితం వినియోగం తగ్గించి రాష్ట్రపతి కార్యాలయాన్ని పర్యావరణ హితంగా మార్చనున్నట్లు రాష్ట్రపతి భవన్ ఆ ప్రకటనలో వివరించింది. ఇంధనం, విద్యుత్ వినియోగం విషయంలో పొదుపు పాటించాలని, ఖర్చులు వీలైనంత వరకు తగ్గించాలని రాష్ట్రపతి ఆదేశించినట్లు వెల్లడించింది.
ఈ పొదుపు చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి బడ్జెట్లో సుమారు 20 శాతం ఆదా అవుతుందని తెలిపింది. ఆ మొత్తాన్ని కరోనాపై పోరుకు వినియోగించాలని రాష్ట్రపతి సూచనలు చేసినట్లు వెల్లడించింది. దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వేస్తున్న అడుగుల్లో రాష్ట్రపతి తనవంతుగా చేస్తున్న చిన్న సహకారం అని పేర్కొంది. కాగా, ఇప్పటికే పీఎం-కేర్స్కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన మార్చి నెల వేతనాన్ని విరాళంగా అందించిన విషయం తెలిసిందే.