షాకింగ్: కరోనా విలయంలో తొలిసారి -ఆస్పత్రి నుంచి వ్యాక్సిన్లు చోరీ -బ్లాక్ మార్కెట్కు తరలింపు!
భారత్ లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి భయానకంగా సాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు రెండు లక్షలకు చేరువగా, మరణాలు వెయ్యికిపైగా నమోదవుతుండటం ప్రమాదకర పరిస్థితులను వెల్లడిస్తున్నది. మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయగా, కొన్ని రాష్ట్రాల్లో టీకాల కొరత ఉందనే వాదన విపిస్తోంది, వ్యాక్సిన్ల షార్టేజీ లేదన్న కేంద్రం, ఇప్పుడున్న టీకాలకు తోడు మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లకూ అనుమతులు మంజూరు చేసింది. ఈ హడావుడిని అవకాశంగా భావించిన కొందరు అక్రమార్కులు ఏకంగా వ్యాక్సిన్ల చోరీకి పాల్పడ్డారు. టీకాల దొంగతనానికి సంబంధించి తొలిసారి వెలుగులోకి వచ్చిన ఘటన సర్వత్రా కలకలం రేపుతున్నది..

320 డోసుల టీకాలు మాయం..
అసలే దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంటే.. రాజస్ధాన్ రాజధాని జైపూర్లోని టీకా డోసుల చోరీ వ్యవహారం సంచలనంగా మారింది. జైపూర్ సిటీలోని శాస్త్రినగర్ ప్రాంతంలో గల కన్వతియా ఆస్పత్రిలో భారీ ఎత్తున టీకాలు అదృశ్యమయ్యాయి. ఒక్కోటీ 10 డోసులుండే 32 కొవాగ్జిన్ వయల్స్ (మొత్తం 320 డోసుల టీకాలు) గల్లంతయ్యాయంటూ ఆస్పత్రి అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దొంగతనం కేసు కింద బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ..

బ్లాక్ మార్కెట్కు తరలించారా?
భారత్ లో టీకాల పంపిణీకి సంబంధించి కేంద్రం అత్యంత పకడ్బందీ వ్యవస్థను రూపొందించింది. తయారీ నుంచి పంపిణీ దాకా, ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేసేదాకా మొత్తం వివరాలను డిజిటైజ్ చేస్తూ, ఎక్కడిక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. వ్యవస్థ పక్కాగా అమలవుతున్న కారణంగానే జైపూర్ ఆస్పత్రిలో టీకాల చోరీ వ్యవహారం బయటపడింది. స్టోరేజీ కేంద్రాల నుంచి ఆస్పత్రికి తరలించే సమయంలో 320 డోసుల టీకాలు మాయమైనట్లు వెల్లడైంది. చోరీకి పాల్పడ్డ వ్యక్తులు ఆ టీకాలను బ్లాక్ మార్కెట్ కు తరలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పకడ్బందీ వ్యవస్థను రూపొందించినప్పటికీ, అడ్డదారుల్లో వ్యాక్సిన్ల అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజా చోరీ ఘటనతో ఆ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. దీనిపై..

వ్యాక్సిన్ల చోరీపై సర్కార్ సీరియస్
రాజధాని జైపూర్ లోని కన్వతియా ఆస్పత్రిలో కొవాగ్జిన్ టీకాల గల్లంతు వ్యవహారాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్ హిరాలాల్ వర్మ ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు కాగా, ఆరోగ్య శాఖ సైతం అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. వ్యాక్సిన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకే మాయం చేశారని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా టీకా వేసుకున్న వారి సంఖ్య 11,11,79,578గా ఉంది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ కు తోడు రష్యా తయారీ స్ఫుత్నిక్-వి టీకా వాడకానికి సైతం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని విదేశీ టీకాలకూ అనుమతివ్వాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications