ప్రతి 10మందిలో నలుగురికి సైబర్ మోసం.. సైబర్ క్రిమినల్స్ దోపిడీపై షాకింగ్ నిజాలు!!
భారతదేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలను సైబర్ మోసాలపై చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా, పోలీసులు ఎంత పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో సైబర్ మోసాలకు తెగ పడుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలకు తెరతీసి, జనాలను కన్ఫ్యూజన్లో పడేసి అందినకాడికి దోచుకుంటున్నారు.

దేశంలో విపరీతంగా సైబర్ మోసాలు
సోషల్ మీడియాను, డిజిటల్ ప్లాట్ ఫామ్ లను, ఈ కామర్స్ సైట్లను వేటినీ వదలకుండా సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు అర్థం కాని రీతిలో వారిని ట్రాప్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం సైబర్ నేరాలు ఒక అతిపెద్ద సమస్యగా మారాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రజలు సైబర్ నేరగాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మోసాల బారిన పడుతూనే ఉన్నారు.

ప్రతీ నెల 80వేల కేసులకు పైగా సైబర్ నేరాలు నమోదు
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఎంతగా పెరిగిపోతున్నాయి అంటే ప్రతినెల 80 వేల కేసులు సైబర్ నేరాలపై నమోదు అవుతున్నట్లుగా సైబర్ నేరాలపై నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు కాకుండా, సైబర్ మోసాలపై నమోదు కాని కేసులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయని సర్వే పేర్కొంది. సైబర్ మోసగాళ్లు ప్రతి 10 మందిలో నలుగురిని మోసం చేస్తున్నట్టు పేర్కొంది. మోసగాళ్లు ప్రతినెల 200 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడుతున్నారని సర్వే నివేదిక వెల్లడించింది. సైబర్ మోసాల బారిన పడినవారు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్టు సర్వే నివేదిక పేర్కొంది.

జూన్ వరకు భారతదేశంలో 6.7 లక్షలకు పైగా సైబర్ సెక్యూరిటీ కేసులు
ఈ ఏడాది జూన్ వరకు భారతదేశంలో 6.7 లక్షలకు పైగా సైబర్ సెక్యూరిటీ కేసులు నమోదయ్యాయని, ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా పార్లమెంట్కు తెలియజేశారు. సైబర్ నేరగాళ్లతో పోరాడే యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ సైబర్ నేరగాళ్లు దోపిడీలకు పాల్పడుతూనే ఉన్నారని తాజాగా నమోదవుతున్న అనేక సైబర్ క్రైమ్ కేసులు తెలియజేస్తున్నాయి.

జాతీయ భద్రతకు పెను ముప్పుగా సైబర్ నేరాలు..
జాతీయ భద్రతకు పెను ముప్పుగా సైబర్ నేరాలు మారుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. సైబర్ సెక్యూరిటీ కూడా ఒక విధంగా జాతీయ భద్రతతో ముడిపడి ఉంది. డేటా మరియు సమాచారం రెండూ రాబోయే రోజుల్లో భారీ ఆర్థిక శక్తిగా మారబోతున్నాయి, కాబట్టి భారతదేశం డేటా మరియు సమాచార భద్రత కోసం సిద్ధం కావాల్సిన సమయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నప్పటికీ సైబర్ క్రిమినల్స్ ను కట్టడి చేయడంలో, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన రావాల్సిన అవసరం ఉందని, ప్రజలు సైబర్ నేరాలపై అవగాహనతో జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications