మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమే
న్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపినట్లు లేరు. సాయంత్రం 5 గంటల సమయానికి అర్ధ సెంచరీ మార్క్ను కూడా అందుకోలేకపోయింది పోలింగ్ పర్సంటేజ్. 44.52 శాతమే నమోదైంది. చివరి గంటలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా ఓటర్లు కనిపించట్లేదు. ఫలితంగా 50 శాతానికి కాస్త అటూ, ఇటూగా మాత్రమే పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
మధ్యాహ్నం 2 గంటలకు 28.14 శాతం..
ఉదయం 8 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. 70 అసెంబ్లీ స్థానాల కోసం 672 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోదలచుకున్నప్పటికీ.. ఢిల్లీవాసులు మాత్రం వారి పట్ల కనికరం చూపలేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి బద్ధకించారు. పోలింగ్ ఆరంభమైనప్పటి నుంచీ అదే పరిస్థితి దాదాపు అన్ని చోట్లా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం కేవలం 28.14. దీన్ని బట్టి చూస్తే.. ఢిల్లీ వాసులు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి కనపర్చలేదనే అనుకోవచ్చు.
2 నుంచి 5 గంటల మధ్య.. ఓ మోస్తరుగా..
మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య ఓ మోస్తరుగా పోలింగ్ పర్సెంటేజ్ ముందుకు కదిలింది. 2 గంటల వరకు 28.14 శాత వరకు నమోదైన పోలింగ్ శాతం.. 5 గంటల సమయానికి రెట్టింపైంది. 44.52 శాతం వద్దకు చేరుకుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉన్నందు.. చివరి గంటలో పోలింగ్ శాతం పెరుగుతందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం వల్ల పోలింగ్ శాతం భారీగా నమోదవుతుందిని అనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు.
ఎవరి కొంప ముంచుతుందో..?
పోలింగ్ శాతం ఇంత దారుణంగా నమోదు కావడం పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకుల్లో కలవరానికి దారి తీస్తోంది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ అయిదేళ్లలో తాము సాధించిన అద్భుత ప్రగతిని చూసి.. ఓటర్లు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆశించినప్పటికీ.. పోలింగ్ పర్సెంటేజీ పెరగకపోవడం వారిలో ఆందోళనకు కారణమౌతోంది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్లదీ అదే తీరు. తగ్గిన పోలింగ్ శాతం ఎవరి కొంపముంచుతుందనేది ఈ నెల 11వ తేదీన స్పష్టమౌతుంది.