దేశంలో ఫిరాయింపుల్లో బీజేపీ టాప్- తర్వాతి స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్- తాజా రిపోర్ట్
దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీలను సైతం వీడి విపక్షాల్లోకి ఫిరాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల బెడద ఎక్కువగానే ఉంది. అయితే దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను గమనిస్తే ఇందులో 44 శాతం మంది బీజేపీలోకి ఫిరాయించారు. ఆ తర్వాత స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉండటం విశేషం. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఫిరాయింపుల్లో టాప్లో బీజేపీ
దేశవ్యాప్తంగా ఇతర పార్టీల్లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు కొత్తేమీ కాకపోయినా ఓ పార్టీలోకి అత్యధిక మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న రికార్డు బీజేపీకే దక్కుతోంది. గత ఐదేళ్లలో దేశంలో ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు బీజేపీలోకి వెళ్లినట్లు తాజాగా వెల్లడైన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తేల్చింది. ఈ ఐదేళ్లలో దేశంలో మొత్తం 405 మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించగా.. ఇందులో 182 మంది బీజేపీలోకే ఫిరాయించారు. అంటే మొత్తం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో బీజేపీలోకి వెళ్లిన వారే 44 శాతం మంది ఉన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్లోకి ఫిరాయింపులు
దేశంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పార్టీల జాబితాలో బీజేపీ తర్వాత స్దానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు బీజేపీ కంటే ఎంతో దూరంలో ఉన్నాయి. గత ఐదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీలోకి 38 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. అలాగే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్లోకి 25 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఆ తర్వాత స్దానాల్లో మిగతా పార్టీలు ఉన్నాయి. దీంతో ఫిరాయింపులను ప్రోత్సహించే విషయంలో బీజేపీతో ఈ రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఫిరాయింపులు
ఏడీఆర్ ప్రకటించిన తాజా జాబితాలో మరో కీలకమైన అంశం కూడా ఉంది. దేశంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా పరస్పరం ఫిరాయింపులు చేసుకుంటున్నట్లు తేలింది. బీజేపీలోకి ఫిరాయించిన 182 మందిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే 170 మంది ఉన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల్లో చేరారు. మరోవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలను ఈ ఐదేళ్లలో పార్టీలో చేర్చుకుంది. దీంతో పరస్పర ఫిరాయింపుల విషయంలోనూ ఈ ముగ్గురికీ ఎలాంటి మొహమాటాలూ లేవని అర్ధమవుతోంది.
ఫిరాయింపులతో కూలుతున్న ప్రభుత్వాలు
దేశంలో ఈ ఐదేళ్లలో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్పకూలాయి. ఇలా కుప్పకూలిన ప్రభుత్వాల్లో మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక ఉన్నాయి. ఆయా చోట్ల ఎమ్మెల్యేల ఫిరాయింపులతో అత్యధికశాతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కుప్పకూల్చి బీజేపీ అధికారం చేపట్టింది. మరోవైపు ఈ ఐదేళ్లలో ఫిరాయింపులకు పాల్పడిన 16 మంది ఎంపీల్లో 10 మంది బీజేపీలోకే ఫిరాయించారు. విచిత్రంగా 2019 ఎన్నికల సమయంలో 12 మంది లోక్సభ ఎంపీలు ఇతర పార్టీలను వీడి కాంగ్రెస్లో చేరారు.