ఎల్జేపీలో కేబినెట్ బెర్తుల చిచ్చు-చిరాగ్ పాశ్వాన్పై ఎంపీల తిరుగుబాటు-బాబాయ్కి మద్దతు
లోక్జనశక్తి పార్టీలో త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణ చిచ్చు రేపింది. దివంగత నేత రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయన బాబాయ్ పశుపతి నాథ్ పరస్కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు వారు లేఖ కూడా రాశారు.
గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి స్వతంత్రంగా పోటీ చేయాలన్న రాంవిలాస్ పాశ్వాన్ నిర్ణయాన్ని ఆయన సోదరుడు పశుపతి నాథ్ పరస్ బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే పార్టీ నేతలు అప్పట్లో ఆయనతో మాట్లాడి శాంతింపజేశారు. పాశ్వన్ మరణం తర్వాత పరస్ నేతృత్వంలో ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు లోక్ జనశక్తి పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పాశ్వాన్ స్ధానంలో ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్కు త్వరలో జరిగే విస్తరణలో కేంద్ర కేబినెట్ బెర్తు ఇవ్వాలని ఎన్డీయే నేతలు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పరస్.. ఎంపీల్ని తనవైపు తిప్పుకున్నారు.
చిరాగ్ పాశ్వాన్ వైఖరితో విభేదిస్తున్న ఐదుగురు ఎంపీలు పశుపతినాథ్ పరస్, ఆయన తనయుడు ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణా దేవీ, మెహబూబ్ అలీ కైసర్ లోక్సభ స్పీకర్కు ఓ లేఖ రాశారు. ఇందులో పార్లమెంటరీ పార్టీ నేతగా చిరాగ్ పాశ్వాన్ను తప్పించి పరస్ను నియమించాలని కోరారు. తద్వారా పార్టీ ఎంపీల మద్దతున్న పరస్కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీయేపై ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడిగా పోటీ చేసి తమను 30-40 స్ధానాల్లో దెబ్బతీసిన పాశ్వాన్ కుమారుడికి ఎట్టిపరిస్ధితుల్లో మద్దతివ్వరాదని ఎన్డీయే భాగస్వామి జేడీయూ కూడా కోరుతుండటంతో చిరాగ్కు సమస్యలు తప్పడం లేదు.