ఈ రోజే కమల్ హాసన్ పార్టీ ప్రారంభించడం వెనుక? మధురైలో ప్రకటన వెనుక 5 కారణాలు
చెన్నై: నటుడు కమల్ హాసన్ సాయంత్రం ఆరు గంటలకు మధురైలోని ఒత్తకడాయ్ మైదానంలో కొత్త పార్టీ ప్రకటన చేస్తున్నారు. పార్టీ పేరు, వివరాలు ప్రకటిస్తారు. అయితే కమల్ పార్టీ ప్రకటించడానికి ఫిబ్రవరి 21వ తేదీన ఎంచుకోవడానికి ఓ కారణం ఉందట.
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అందుకే ఈ రోజున కమల్ పార్టీ వివరాలను ప్రకటిస్తున్నారని అంటున్నారు. ఆయన ఉదయం రామేశ్వరానికి చేరుకొని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులను కలిశారు.
అనంతరం అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, తమిళనాడులో కొత్త పార్టీలకు అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ నేత వీరప్ప మొయిలీ అన్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్ ప్రభావం అంతగా ఉండదన్నారు.
మహాత్మా గాంధీ ఇక్కడే ఫార్మల్ దుస్తులు వదిలేశారు
ఇదిలా ఉండగా కమల్ హాసన్ మధురైలో పార్టీ ప్రకటించడానికి ఐదు కారణాలు ఉన్నాయి. 1921లో జాతిపిత మహాత్మా గాంధీ మధురైలోనే ఫార్మల్ దుస్తులు వదిలి దోవతి ధరించాడు. బాపు యాత్రలో ఇది చాలా కీలకమైనది.
ఇదివరకు మధురైలో కమల్ హాసన్ స్వగ్రామం
కమల్ హాసన్ స్వగ్రామం మధురై సమీపంలోని పరమకూడి. ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలుగా విడదీసే వరకు పరమకూడి మధురైలో ఓ భాగంగా ఉండేది.
రాజధాని చెన్నై అయినా మధురై లేకుంటే
మరో ఆసక్తికర విషయం ఏమంటే తమిళనాడుకు చెన్నై రాజధాని. కానీ మధురైలో పట్టు లేకుంటే అధికారం ఉన్నప్పటికీ ఏదో కోల్పోయినట్లుగా తమిళ రాజకీయ నాయకులు, పార్టీలు భావిస్తాయని అంటున్నారు. ఇది కూడా కమల్ మధురైలో పార్టీ ప్రకటన చేయడానికి కారణమని చెబుతున్నారు.
ఎంజీ రామచంద్రన్ నుంచి విజయకాంత్ వరకు
ఎంజీ రామచంద్రన్ ఎప్పుడు కూడా మధురై నుంచి లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోటీ చేశారు. నటుడు విజయకాంత్ కూడా 2005లో తన పార్టీని ఇక్కడి నుంచే ప్రారంభించారు.
మధురైలో థేవార్ల ప్రాబల్యం
మధురైలో థేవార్ల ప్రాబల్యం ఎక్కువ. కమల్ హాసన్ పలు సినిమాలకు ఈ కమ్యూనిటీ స్ఫూర్తి అంటారు. తేవార్ మగన్ సూపర్ డూపర్ హిట్ మూవీ. తమిళ సంస్కృతి సంప్రదాయాల అంశం వచ్చినా మధురై గుర్తుకు వస్తుంది.