బిల్డింగ్ కూలి 6గురు, బస్ ప్రమాదంలో 19మంది మృతి
ముంబై/సిమ్లా: మహారాష్ట్రలోని ముంబై నగరంలోని మజ్గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఐదంతస్తుల బిఎంసి(బృహన్ముంబై కార్పొరేషన్) భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా సుమారు 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటన స్థలంలో శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నాలుగు అంబులెన్స్ల ద్వారా జెజె ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి 12 అగ్నిమాపక యంత్రాలు, రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. శిథిలాలను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, మరికొంత మంది శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బిఎంసి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గోడౌన్ ఉందని, దానికి మరమ్మతులు చేసే సందర్భంలోనే ప్రమాదం జరిగిందని స్థానిక శివసేన కార్యకర్త ఒకరు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం సిర్మౌర్ జిల్లాలోని రాన్సువా-జాబ్రోగ్ గ్రామాల మధ్య రహదారిపై నుంచి వెళుతుండగా ప్రమాదవశాత్తు 600 అడుగుల లోతు గల లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్లు సిర్మౌర్ డిప్యూటీ కమిషనర్ వికాస్ లాబ్రూ తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారిని దదాహులోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 18 మంది మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. రెస్క్కూటీం, స్థానిక ప్రజల సహాయంతో మృతదేహాలను బయటికి తీసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఉచ్చతక్కర్, రాన్సువా, జాబ్రోగ్, చుట్టూ పక్కల ప్రాంతానికి చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్ర గవర్నర్ ఊర్మిలా సింగ్, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, రవాణా శాఖ మంత్రి బాలి తీవ్ర సంతాపం ప్రకటించారు.