సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం- తిరిగి డ్యూటీలోకి రిటైర్డ్ జడ్డిలు- ఎందుకో తెలుసా ?
సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న కేసులకు తోడు కొత్తగా వచ్చిపడుతున్న కేసులతో న్యాయస్ధానాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అలా అని చూస్తూ మౌనంగా ఉండిపోలేని పరిస్ధితి. దేశంలో న్యాయ వ్యవస్ధపై నమ్మకం నిలబట్టాలన్నా, భవిష్యత్ తరాల్లో విశ్వాసం నింపాలన్నా కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి. దీంతో సుప్రీంకోర్టు తాజాగా ఓ అసాధారణ నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.

కుప్పలుతెప్పలుగా పెండింగ్ కేసులు
దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో హైకోర్టులు, జాతీయ స్దాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి బాథితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ గతంతో పోలిస్తే పెరిగిపోతున్న వివాదాలు, సివిల్ కేసులు, క్రిమినల్, సైబర్ నేరాలు, ప్రభుత్వ విధానాల లోపాలపై ప్రజాప్రయోజన వాజ్యాలు, రాజ్యాంగ పరిధిలోని అంశాలపై పిటిషన్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక్క రోజులే ఒక్క కలం పోటుతో పరిష్కారమయ్యే కేసులు కాదు. వీటిపై వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ పెండింగ్ కేసులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి.

హైకోర్టుల్లోనే 5 లక్షల పెండింగ్ కేసులు
దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లోనే 5 లక్షలకు పైగా పెండింగ్ కేసులున్నట్లు తాజాగా తేల్చారు. దీంతో ఈ కేసుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు అసాధారణ చర్యలకు దిగాల్సిన పరిస్ధితి నెలకొంది. బాథితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా ఈ కేసులపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు వీలైనన్ని మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ కేసుల పరిష్కారం కోసం హైకోర్టుల్లో అదనపు జడ్జీల నియామకం తప్పనిసరి. కానీ ప్రస్తుతం హైకోర్టుల్లో ఉండాల్సిన మేరకు జడ్డీలే లేరు. దీంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.

40 శాతానికి చేరిన న్యాయమూర్తుల కొరత
దేశంలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం హైకోర్టులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా న్యాయమూర్తుల కొరత తీవ్రంగా పట్టి పీడిస్తోంది. దీంతో కొత్తగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం దృష్టిపెడుతోంది. తాజాగా 45 మంది న్యాయమూర్తులను వివిధ హైకోర్టులకు పంపారు. అదే సమయంలో మరిన్ని ప్రత్యామ్నాయాలపైనా సుప్రీంకోర్టు దృష్టిసారిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయాలను సూచించాలని హైకోర్టులనూ సుప్రీంకోర్టు కోరుతోంది. త్వరలో వీటిపై స్పందన వచ్చాక కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

రిటైర్డ్ జడ్డిలను రీకాల్ చేయనున్న సుప్రీంకోర్టు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న 5 లక్షల పెండింగ్ కేసుల పరిష్కారం కావాలంటే అదనంగా 40 శాతం జడ్డీలను నియమించాల్సి ఉంది. అయితే ఇంతమంది న్యాయమూర్తులను కొత్తగా నియమించాక కూడా అవి పరిష్కారం అవుతాయన్న గ్యారంటీ లేదు. దీంతో అనుభవజ్ఞుల సేవల్ని వినియోగించుకోవాలని సుప్రీం భావిస్తోంది. దీంతో హైకోర్టుల్లో పనిచేసి రిటైర్ అయిన జడ్డీల సేవల్ని వాడుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఏప్రిల్ 8 కల్లా తమ అభిప్రాయాలు చెప్పాలని హైకోర్టు ఛీఫ్ జస్టిస్లను సుప్రీంకోర్టు కోరింది. దీంతో ఇప్పుడు హైకోర్టు సీజేలు ఆ పనిలో బిజీగా ఉన్నారు.

తొలిసారి విచక్షణాధికారం వాడుతున్న సుప్రీంకోర్టు
ఇప్పటివరకూ దేశంలో రిటైర్డ్ జడ్డిల సేవల్ని తిరిగి హైకోర్టుల్లో వాడుకున్న దాఖలాలు లేవు, ఇప్పుడు పెండింగ్ కేసులు, జడ్జీల కొరత నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణంగా వారి సేవల్ని వాడుకోవాలని నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం తమకు సంక్రమించిన అసాధారణ అధికారాల్ని తొలిసారి వాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ఛీఫ్ జస్టిస్లు తప్పనిసరి పరిస్ధితుల్లో రిటైర్డ్ జడ్డీలను రీకాల్ చేసే అధికారం కల్పిస్తోంది. అత్యవసర పరిస్ధితుల్లో హైకోర్టు ఛీఫ్ జస్టిస్లు తమ హైకోర్టుల్లో లేదా ఇతర హైకోర్టుల్లో జడ్డీలుగా పనిచేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్రపతికి పేర్లను సూచించాల్సి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి వాటిని పరిశీలించి అనుమతిస్తారు.