డిల్లీ వలస కార్మికుల్లో లాక్డౌన్ భయం- స్వస్ధలాలకు పయనం -కేజ్రివాల్ వద్దన్నా
ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు కేజ్రివాల్ సర్కారు ఆరు రోజుల పాటు పూర్తి కర్ఫ్యూ విధించింది. దాదాపు లాక్డౌన్ తరహాలోనే ఉన్న ఈ కర్ప్యూ కారణంగా అక్కడ జన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే ఢిల్లీకి వీఐపీల రాక తగ్గిపోగా... స్ధానిక ప్రజలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వలస కార్మికులు మాత్రం స్వస్ధలాలకు పయనమవుతున్నారు.
ఢిల్లీలో గతేడాది విధించిన లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడిన వలస కార్మికులు ఇప్పుడు విధించిన ఆరు రోజుల కర్ప్యూను కూడా లాక్డౌన్గానే భావిస్తున్నారు. అయితే రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండటంతో సాధ్యమైనంత త్వరగా స్వస్ధలాలకు పయనమవుతున్నారు. పూర్తి లాక్డౌన్ విధిస్తే ఇక తాము ఇళ్లకూ వెళ్లలేక ఢిల్లీలో ఉండలేక ఇబ్బందులు పడాలని వారు భయపడుతున్నారు. దీంతో ఢిల్లీ ఆనంద్ విహార్లోని బస్ టెర్మినల్ రద్దీగా మారిపోయింది.
మరోవైపు లాక్డౌన్ పొడిగింపు ఉండదని, గతేడాది పరిస్దితులు పునరావృతం కావని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వలస కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారిని ఢిల్లీ వదిలి వెళ్లొద్దని కోరుతున్నారు. అయినా వారు కేజ్రివాల్ మాటల్ని పట్టించుకునే పరిస్దితుల్లో ఉన్నట్లు కనిపించడం లేదు, దీంతో ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ చూసినా స్వస్ధలాలకు బయలుదేరిన వలస కార్మికులు కనిపిస్తున్నారు. రద్దీ కారణంగా ఎలాంటి శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తకుండా పోలీసులు అదనపు బలగాలు మోహరిస్తున్నారు.