అలజడి: 6గురు మావోల ఎన్కౌంటర్, కిడ్నాపైన టిడిపి నాయకుల విజ్ఞప్తి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జిల్లా దర్బాఘాట్ వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరు మహిళ ఉన్నారు.
మంగళవారం నాడు 100 మంది గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గ్రామస్తులను ఎత్తుకెళ్లిన శంకర్, వినోద్ కూడా మృతి చెందారు.
సుకుమా జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు
సుకుమా జిల్లాలో ముగ్గురు మవోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి 8 కిలోల ఆర్డీఈని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మమ్మల్ని విడిపించండి: టిడిపి నాయకులు
విశాఖ మన్యంలో బాక్సైట్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులను కూడగడుతున్న మావోలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
గూడెం కొత్తవీధి మండలంలో అధికార టిడిపికి చెందిన ముగ్గురు నాయకులను మావోయిస్టులు సోమవారం కిడ్నాప్ చేశారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఎఓబి) ప్రత్యేక జోనల్ కమిటీ నేతృత్వంలో ఈ కిడ్నాప్ జరిగింది.
మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మామిడి బాలయ్య పడాల్ (45) టిడిపి మండలాధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. గూడెం గ్రామానికి చెందిన ముక్కలి మహేష్ (42) జిల్లా కార్యవర్గ సభ్యునిగా, కొత్తూరు గ్రామానికి చెందిన వండలం బాలయ్య(48) పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా పని చేస్తున్నాడు.

వీరు ముగ్గురు సోమవారం కొత్తూరు ప్రాంతంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి వెళ్తుండగా మావోయిస్టులు దారిలో అడ్డగించి అపహరించారు. మంగళవారం ఉదయం మావోయిస్టులు విడుదల చేసిన ఒక లేఖ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం రంగం దాదాపు సిద్ధం చేసినందున అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురిని అపహరించామని ఎఓబి ప్రత్యేక జోనల్ కమిటీ ఆ లేఖలో పేర్కొంది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను విరమించుకుంటున్నట్టు తక్షణం ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని, లేనట్టయితే టిడిపి నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.
బాక్సైట్ తవ్వకాలే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న పోలీసుల కూంబింగ్లు, దాడులు , అరెస్ట్లు, క్యాంప్లు తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది. టిడిపి నాయకులు పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈనెల 7 నుండి 13 వరకు జరిగే నిరసన దినాలు, 48 గంటల మన్యం బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా, ఇలాఉంటే బాక్సైట్ పైన ప్రభుత్వం స్పందించి తమ ప్రాణాలు కాపాడాలని మావోయిస్టుల చెరలో ఉన్న ముక్కలి మహేష్ , మామిడి బాలయ్య, వండలం బాలయ్య ఒక ప్రకటనలో వేడుకున్నారు. ఈ మేరకు ఎఓబి ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట చెరలో ఉన్న నేతల సంతకాలతో స్థానిక విలేకరులకు ఒక ప్రకటన పంపించారు.
తాము ప్రస్తుతం మావోయిస్టుల చెరలో ఉన్నామని తక్షణమే ప్రభుత్వం స్పందించి బాక్సైట్ తవ్వకాలు జరపబోమంటూ చేసే ప్రకటనపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరపబోమంటూ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలన్నారు. బాక్సైట్పై అందరూ పోరాడి తమ విడుదలకు సహకరించాలని ఆ ప్రకటనలో వేడుకున్నారు.












Click it and Unblock the Notifications