భర్తలేని టైంలో ప్రియుడితో..: చూసిందని కూతురి గొంతుకోసింది
న్యూఢిల్లీ: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మరింత దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల కాలంలో హత్యలు విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. తాజాగా, ఇలాంటి ఘటనే దేశరాజధానిలో చోటు చేసుకుంది.
తన వివాహేతర సంబంధం గురించి కూతురుకు తెలిసిపోయిందని... కన్నతల్లే కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తూర్పుఢిల్లీలోని ఘాజీపూర్లో చోటు చేసుకుంది.
కూతురు కనిపించడం లేదంటూ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి మున్నీదేవి కుటుంబం.. తమ ఆరేళ్ల చిన్నారి కాజల్ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా..
కాజల్ ఫొటోలను వాట్సప్, ఫేస్బుక్లలో షేర్ చేయడంతో పాటూ, తీవ్రంగా గాలింపు చేపట్టారు. చిన్నారి కోసం తీవ్రంగా సోదాలు చేస్తున్న పోలీసులకు ఓ ఇంటిపైన కాజల్ మృత దేహం కనిపించింది. చిన్నారి కాజల్ గొంతు కోసి మరీ చంపినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో తానే హత్య చేసినట్లు తల్లి మున్నీ దేవి(30) ఒప్పుకుంది.
భర్తలేని టైంలో ప్రియుడితో సన్నిహితంగా..
మున్నీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త, పిల్లలు బయటకు వెళ్లాక మున్నీదేవి ప్రియుడు సుధీర్ (22) ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడని తెలిపింది. కాగా, సుధీర్తో మున్నీదేవి చాలా సన్నిహితంగా ఉండగా.. చిన్నారి కాజల్ అనుకోకుండా చూసింది. అయితే, ఈ విషయాన్ని తండ్రికి చెప్పేందుకు కాజల్ పరుగు తీసింది.
కన్న కూతుర్నే వెంటాడి గొంతుకోసింది..
దీంతో కాజల్ కంటే వేగంగా మున్నీదేవి పరుగుల తీసి చిన్నారిని పట్టుకుంది. అంతలోనే కత్తిని తీసుకుని సుధీర్ వచ్చాడు. సుధీర్.. కాజల్ కాళ్లు చేతులు పట్టుకుని ఉండగా.. తల్లి మున్నీదేవి గొంతుకోసి ప్రాణం తీసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడ్నుంచి పారిపోయారు. నిందితులు మున్నీదేవి, సుధీర్లపై హత్య కేసు నమోదు చేసినట్లు డీసీపీ ఓమ్వీర్ సింగ్ తెలిపారు.