షాక్: 60లక్షల మంది రూ.7లక్షల కోట్లు జమచేశారు!
పెద్దనోట్లు రద్దుచేసినట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు రూ.7 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు డిపాజిట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న పెద్దనోట్లు రద్దుచేసినట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు రూ.7 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు డిపాజిట్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ మొత్తం రూ.7లక్షల కోట్లని, ఇది ఆశ్చర్యకరమైన మొత్తమని పేర్కొన్నారు.
నిఖార్సయిన డిపాజిటర్లకు ఎటువంటి వేధింపులూ ఉండవని, అదే సమయంలో నల్లకుబేరులు పన్ను ఎగవేసినట్లు తేలితే విచారణ ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. రూ.2లక్షలు, రూ.5లక్షల కన్నా ఎక్కువగా ఉండే డిపాజిట్లపై తాము రోజువారీ సమాచారం తెప్పించుకుంటున్నామని తెలిపారు.
ప్రతి వ్యక్తికి సంబంధించి ఈ సమాచారాన్ని, గత సమాచారంతో పోల్చి చూసుకుంటున్నామన్నారు. 'రూ.2లక్షలకన్నా ఎక్కువగా జమ అయిన మొత్తాలను చూస్తే మా వద్ద 60లక్షల మంది వ్యక్తులు, సంస్థల సమాచారం మా వద్ద ఉంది. ఈ వ్యక్తులు, సంస్థలు జమ చేసిన మొత్తం విలువ రూ.7లక్షల కోట్లు. ఇది ఆశ్చర్యకరమైన మొత్తం. ఈ మొత్తాలను పరిశీలిస్తున్నాం' అని తెలిపారు.
అంతేగాక, 'పెద్ద మొత్తాల్లో జమ చేసిన వ్యక్తుల వరకు చూసుకుంటే ఆ మొత్తం రూ.3లక్షల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్ల వరకు ఉంది. పన్ను వసూలుకు ఇప్పుడు పెద్ద ఎత్తున అవకాశం ఉంది' అని పేర్కొన్నారు.
'బ్యాంకులో వేసినంత మాత్రాన నల్లధనం తెల్లధనంగా మారదు. అటువంటి వారు ముందుకొచ్చి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. వారు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో సంతోషంగా ఉండబోరు' అని ఒక అధికారి స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాల్లో నోట్లు డిపాజిట్ చేసినా ఐటీ శాఖ నిఘా కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది