షాక్ : కుప్పకూలిన ఏడంతస్తుల భవనం... ఏడుగురు దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగా గాయపడ్డారు.గాయపడ్డారు.
కాన్పూర్: నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగానే గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లోని జజ్ మావు ప్రాంతంలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి.
కూలీలు ఎవరి పనుల్లో వారు మునిగి ఉండగా.. ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగానే గాయపడ్డారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు ఆర్మీ, పోలీసు అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ముగ్గురిని బయటికి తీయగలిగారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం కాన్షీరాం మెమోరియల్ ట్రామా సెంటర్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
ఈ భవనం కాన్పూర్ డెవలప్ మెంట్ అధారిటీ కాలనీలో, ప్రసిద్ధి చెందిన అల్లా హో అక్బర్ మసీదు పక్కనే ఉందని, మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరగవచ్చని కాన్పూర్ డిఐజి రాజేష్ మోదక్ తెలిపారు. భవనం కూలిపోవడానికి దాని పునాదులు బలహీనంగా ఉండడమే కారణమని తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జరిగిన ఘోరంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.