మన ఢిల్లీలో.. 70 వేల మంది పిల్లలు.. దమ్ మారో దమ్!
దేశ రాజధాని నడివీధుల్లో తిరిగే దాదాపు 70 వేలమంది పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారు. ఈ విషయం తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడివీధుల్లో తిరిగే దాదాపు 70 వేలమంది పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారు. తొమ్మిదేళ్ల ప్రాయం నుంచే వాళ్లకు ఈ అలవాటు ఉంటోంది. ఈ విషయం తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
దేశ రాజధాని వీధుల్లో తిరుగుతున్న ఇలాంటి వీధిబాలల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవీ పెద్దగా వాళ్ల దరిజేరడం లేదు. ఈ మొత్తం అంశాలపై ఢిల్లీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రభుత్వంతో కలిసి ఓ సర్వే నిర్వహించింది.
వీధిబాలల గురించి ఇటీవలి కాలంలో చేసిన అతిపెద్ద సర్వే ఇదేనని ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మృణాళినీ దర్స్వాల్ తెలిపారు. ఏదో ఒక రూపంలో దాదాపు 70 వేల మంది పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉంటోందని, 20 వేల మంది పొగాకు వాడుతున్నారని పేర్కొన్నారు.
9500 మంది మద్యం తాగుతుండగా, మిగిలిన పిల్లలు రకరకాల డ్రగ్స్ కు బానిసలయ్యారని, పొగాకు, డ్రగ్స్ పీల్చే అలవాటు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉంటోందని, 11 ఏళ్ల వయసులో మద్యం తాగడం మొదలుపెడుతున్నారని ఆమె చెప్పారు.
12-13 ఏళ్ల వయసు నుంచే హెరాయిన్, ఓపియం లాంటి డ్రగ్స్ వాడుతున్నారని, తాము కూడా పెద్ద వాళ్లలా సిగరెట్లు కాల్చాలనో, తమ కుటుంబాల గురించి మర్చిపోడానికో.. ఇలా ఏదో ఒక కారణంతో మొత్తం మీద ఈ వీధి బాలలంతా డ్రగ్స్, పొగాకు వాడకానికి బానిసలుగా మారిపోయినట్లు డాక్టర్ మృణాళినీ దర్స్వాల్ వివరించారు.
నిజానికి వీధిబాలలుగా తిరుగుతున్న వాళ్లలో 60 శాతానికిపైగా నిజానికి తమ కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. సుమారు 20 శాతం మంది పిల్లలు వీధుల్లో భిక్షమెత్తుకుని తమ కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది.
వీళ్లు ఎక్కువగా షాపింగ్ మాల్స్, రైల్వే ప్లాట్ ఫారాలు, బస్టాండ్లు, డంపింగ్ యార్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆలయాలు, హోటళ్ల బయట కనిపిస్తూ ఉంటారు. ఈ పిల్లలలో కేవలం 10.9 శాతం మంది మాత్రమే స్కూళ్లలో చదువుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.