దారుణం: భుజంపై కూతురి శవంతో 4 కిలోమీటర్లు నడిచిన తల్లిదండ్రులు!
బీహార్లో మరో దారుణం చోటుచేసుకుంది. పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓపీ కార్డు కావాలంటే క్యూలైన్లోనే రావాలని అధికారులు చెప్పడంతో ఆ కార్డు తెచ్చేలోగా ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది. చివరికి ఆ చిన్న
పాట్నా: బీహార్లో మరో దారుణం చోటుచేసుకుంది. పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓపీ కార్డు కావాలంటే క్యూలైన్లోనే రావాలని అధికారులు చెప్పడంతో ఆ కార్డు తెచ్చేలోగా ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది.
చివరికి ఆ చిన్నారి మరణించాక కూడా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ అంబులెన్స్ ఇవ్వడానికి కూడా ఆసుపత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో గతిలేక ఆ తండ్రి భార్యను వెంటబెట్టుకుని, తన కుమార్తె శవాన్ని భుజాన మోసుకుంటూ 4 కిలోమీటర్ల పాటు వెళ్లాడు.
బీహార్లోని లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్ బాలక్ దంపతుల కుమార్తె రౌషణ్ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
అక్కడి సిబ్బంది తొలుత ఔట్ పేషంట్(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్ బాలక్ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె పరిస్థితి తీవ్రంగా ఉందని అతని భార్య తెలిపింది.
దీంతో తనకు ఓపీ కార్డు త్వరగా మంజూరు చేయాలనీ, తన చిన్నారి పరిస్థితి తీవ్రంగా ఉందని కౌంటర్లో ఉన్న అధికారిని అభ్యర్థించారు. తనను ముందుకు వెళ్లనివ్వాలని లైన్లో ఉన్నవారిని కూడా అతడు వేడుకున్నారు.
క్యూ లైన్ లో నిలబడిన వారు అతడి పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు వెళ్లమని చెప్పారు. కానీ కౌంటర్ లో ఓపీ కార్డులిచ్చే వ్యక్తి మాత్రం ససేమిరా అన్నారు. లైన్ లోనే నిలబడి తీసుకోవాలని చెప్పాడు.
చివరికి ఓపీ కార్డు తీసుకుని బయటికి వచ్చేసరికే ఘోరం జరిగిపోయింది. రోషణ్ కుమారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో రామ్ బాలక్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.
కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కనీసం అంబులెన్స్ అయినా ఏర్పాటు చేయాలని రామ్బాలక్ వేడుకోగా.. ఎయిమ్స్ అధికారులు ఆ విన్నపాన్నీ తిరస్కరించారు.
దీంతో ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత కూడా లేకపోవడంతో గత్యంతరం లేక రామ్ బాలక్ తన కుమార్తె శవాన్ని భుజాన వేసుకుని, భార్య అనుసరించగా.. అలా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు.