బచ్చా గ్యాంగ్: పోలీసునే దోచుకున్న 9ఏళ్ల బాలిక, రూ.4 లక్షలతో పరారీ
మధుర: తొమ్మిదేళ్ల బాలిక ఓ పోలీసుకే టోకరా వేసి, నాలుగు లక్షల రూపాయలతో ఉడాయించిన సంఘటన బుధవారం మథురలోని కోటావ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసు కానిస్టేబుల్ దగ్గర్నుంచి దర్జాగా రూ 4 లక్షలు దోచుకు వెళ్లింది. కానిస్టేబుల్ విజయ్ పాల్ సింగ్, తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం, బుధవారం చౌకీ బాగ్ వద్దనున్న బ్యాంకులో రూ 4.02 లక్షలు డ్రా చేసుకున్నాడు.
అతడు బయటికి రాగానే, ఓ బాలిక అతడి ప్యాంట్పై మురికి ఉందని, శుభ్రం చేసుకోవాలని చెప్పింది. దాంతో విజయ్పాల్ డబ్బుల సంచీని కింద పెట్టి ప్యాంట్ను చూసుకోసాగాడు. అంతే కేవలం లిప్త కాలంలో ఆ బాలిక డబ్బుల బ్యాగ్తో మాయమైపోయింది. దీంతో ఆ కానిస్టేబుల్ లబోదిబోమంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మధురలో ఇటీవలి కాలంలో బచ్చా గ్యాంగ్ (పిల్లల ముఠా)లు పెచ్చుమీరిపోయాయని, పిల్లలు విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదేళ్ల బాలికను ఆ బచ్చా గ్యాంగ్ సభ్యురాలిగా అనుమానిస్తున్నారు.
విజయపాల్ సింగ్ ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబం మాత్రం ఔరంగాబాదులో ఉంటోంది. పక్షం రోజుల్లో కూతురి పెళ్లి జరగాల్సిన స్థితిలో డబ్బు దోపిడీకి గురికావడంతో విజయ్ పాల్ సింగ్ దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు.