ఉత్తరాదిన బీజేపీకి కాంగ్రెస్ బ్రేక్, రెండు రాష్ట్రాల్లో క్లియర్ మెజార్టీ, మధ్యప్రదేశ్లో హంగ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తెలంగాణను టీఆర్ఎస్ గెలుచుకోగా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిజోరాంలో కాంగ్రెస్ పార్టీకి ఎంఎన్ఎఫ్ గట్టి షాకిచ్చింది. మధ్యప్రదేశ్లోను కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.
తెలంగాణలో తెరాసకు 87 సీట్లు, మహాకూటమికి 21 సీట్లు, బీజేపీకి ఒక సీటు, మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు, బీజేపీకి 108 సీట్లు, ఇతరులు 9 సీట్లలో గెలిచే పరిస్థితులు ఉన్నాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ 98 సీట్లు, బీజేపీ 74 సీట్లు, ఇతరులు 27 సీట్లలో గెలిచారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 67, బీజేపీ 15, బీఎస్పీ 8 సీట్లలో గెలిచే పరిస్థితులు ఉన్నాయి. మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 26, స్వతంత్రులు 8, కాంగ్రెస్ 5, ఇతరులు 1 సీటులో గెలిచారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలో ఉంది. 2003 నుంచి కమలం పార్టీ పాలిస్తోంది. అలాంటిది నాలుగోసారి గెలవడం గగనమే. ఇప్పుడు నాలుగోసారి ఆ ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడలేకపోయింది. వరుసగా మూడుసార్లు ఈ రాష్ట్రాల్లో గెలిచి, నాలుగోసారి ఓడిపోవడం బీజేపీకి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారు. ఎందుకంటే నాలుగోసారి గెలవడం సాధారణ విషయం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఊరట. ఇక రాజస్థాన్లో వసుంధరా రాజే ప్రభుత్వంపై ఆగ్రహం, గత మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాన్ని రెండోసారి ఎన్నుకోకపోవడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది.
దీనికి తోడు రాజస్థాన్లో రాజ్పుట్ల ఆగ్రహం, మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన బీజేపీకి నష్టం చేసింది. మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, నాలుగోసారి మాత్రం బీజేపీ మధ్యప్రదేశ్లో మంచి ఫైట్ ఇచ్చారని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఊరట.
అయినప్పటికీ 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఊరట. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో క్రియర్ మెజార్టీ వచ్చింది. ఇక, మిజోరాం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేజారింది. బీజేపీకి ఈ ఫలితాలు చేదు అనుభవం మిగిల్చినప్పటికీ 2019లో తిరిగి పుంజుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.