జాగ్రత్త: 15 నిమిషాలకో కారు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కార్ల దొంగతనాలు ప్రతి 15 నిమిషాలకు ఓ చోట జరుగుతున్నాయని పోలీసు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువగా కార్లు చోరీ అవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
జూలై నెలలో ఢిల్లీ నగరలో ప్రతి రోజు సరాసరి 100 కార్లు చోరీ అయ్యాయని పోలీసులు కేసులు నమోదు చేశారు. 2011లో నమోదు అయిన కార్ల చోరీ కేసుల కంటే రెండింతలు ఎక్కువగా ఈ సంవత్సరం ఇప్పటికే చోరీ కేసులు నమోదు అయ్యాయి.
చోరీకి గురైన కార్లు కేవలం 13 శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం తదితర కారణాలతో కార్లు ఎక్కువ చోరీ అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఎస్ యూవీలతో పోల్చుకుంటే చిన్న కార్లు ఎక్కువగా చోరీ అవుతున్నాయి. కేవలం గత జూలై నెలలో పశ్చిమ ఢిల్లీలో 478, అవుటర్ డిస్ట్రిక్ట్ లో 492, తూర్పు ఢిల్లీలో 517 కార్లు చోరీ అయ్యాయని పోలీసులు తెలిపారు.
రాత్రి పూట గస్తి ఎక్కువగా ఉన్నా ఎక్కడో ఓ చోట వాహనాలు చోరీ అవుతున్నాయని పోలీసులు అన్నారు. మాస్టర్ కీస్, బ్రేక్ లాక్ లతో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.