మా దేశం విడిచిపో: రామేశ్వరంలో చైనా జాతీయుడు, చెన్నైకి తరలింపు
చెన్నై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చైనా దేశీయుల పర్యటనలపై ఆంక్షలు విధించడం జరుగుతోంది. తాజాగా, తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటిస్తున్న ఓ చైనా దేశీయుడ్ని దేశం విడిచివెళ్లిపోవాలంటూ స్థానిక ప్రజలు కోరడం గమనార్హం.
31ఏళ్ల చైనా జాతీయుడు శనివారం రామేశ్వారినికి చేరుకున్నాడు. అయితే, అతడ్ని చూసిన స్థానికులు, ఇతర పర్యాటకులు కొంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే చైనాకు వెళ్లిపోవాలంటూ అతడ్ని అక్కడున్న వారు కోరారు. అతనికి ఏమైనా కరోనావైరస్ ఉందేమోననే భయమే ఇందుకు కారణం కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు చైనా జాతీయుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనికి కరోనావైరస్ లక్షణాలు ఏమీ లేవని వైద్యులు నిర్ధారించారు. అతడు జనవరి 28నే మనదేశానికి వచ్చాడు. మొదట కోల్కతాలో అతడు పర్యటించాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సంచరించాడని జిల్లా కలెక్టర్ కే వీర రాఘవరావు.
కరోనావైరస్ నేపథ్యంలో అతడ్ని అధికారులు రామేశ్వరం నుంచి మదురైకి, ఆ తర్వాత చెన్నైకి తరలించారు. అక్కడ్నుంచి అతడ్ని చైనాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. చైనాలో ఇటీవల కాలంలో పర్యటించిన వారందరికీ తాము పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
కాగా, చైనాలో కరోనావైరస్ బారిన పడి ఇప్పటికే 900 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40వేల మందికిపైగా కరోనావైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాతోపాటు 26 దేశాల్లో కరోనావైరస్ బాధితులు ఉన్నారు. మనదేశంలోనూ మూడు కరోనావైరస్ కేసులు బయటపడ్డాయి.