త్వరలో బూస్టర్ డోస్: రెండు వారాల్లో సమగ్ర ప్రణాళిక: 44 కోట్లమంది పిల్లలకు ఇమ్యునైజేషన్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు సంబంధించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా తన కోరలు చాస్తోంది. మొన్నటిదాకా ఏడెనిమిది ఆఫ్రికా దేశాల్లో కనిపించిన ఈ వేరియంట్.. చాపకింద నీరులా అన్ని దేశాలను కమ్ముకోనుంది. ఇప్పటికే కెనడాలో ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ సోకింది. నైజీరియా నుంచి స్వదేశానికి వెళ్లిన ఇద్దరు కెనడియన్లలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కనిపించాయి. ఆస్ట్రేలియాలోనూ ఓ కేసు వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించింది.
భారత్లోనూ ఈ వేరియంట్ విస్తరించే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కొందరు వ్యక్తులు దక్షిణాఫ్రికా, ఇతర ఆఫ్రికన్ దేశాలకు వెళ్లొచ్చిన తరువాత అనారోగ్యానికి గురయ్యారు. వారి నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ఈ పరిణామాలు మరింత భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. శరవేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ లాక్డౌన్ తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఓ తీపికబురును అందించింది. త్వరలోనే బూస్టర్ డోస్ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని, వచ్చే రెండు వారాల్లో దీన్ని ప్రకటిస్తామని కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. ఓ సమగ్రమైన ప్రణాళికకు తుది రూపాన్ని ఇస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని అన్నారు.
ప్రస్తుతం భారత్లో బూస్టర్ డోస్ అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీన్ని చేర్చలేదు. రెండు డోసుల వ్యాక్సిన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 115 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో సింగిల్ డోస్ తీసుకున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. సెకెండ్ డోస్ కోసం మూడు నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. వ్యాక్సిన్ లభ్యతను బట్టి రెండు డోసుల టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.
దీనికి అదనంగా బూస్టర్ డోస్ను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని డాక్టర్ ఎన్ కే అరోరా అన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి ఇమ్యూనిటీని పెంచడానికి అవసరమైన వ్యాక్సిన్పైనా ప్రకటన చేస్తామని చెప్పారు. ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయంపై ప్రస్తుతం పరిశీలనలో ఉందని, దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే ఈ కార్యాచరణ ప్రణాళిక, బూస్టర్ డోస్ విధానాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications