రేషన్ కార్డుదారులకు అదిరిపోయే సంక్రాంతి కానుక!
తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార డీఎంకే మరో ముందడుగు వేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు శుభవార్తను చెప్పింది.
పొంగల్ స్పెషల్ కానుకలను అందిస్తున్న తమిళనాడు ప్రభుత్వం
గతంలో మాదిరిగానే కాకుండా, ఈసారి మరింత ప్రత్యేకంగా పొంగల్ కానుకలను అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే ఏడాది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వస్తున్న ఈ సంక్రాంతి పండుగ వేళ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కీలక ప్రకటన చేసింది.

తమిళనాడు పొంగల్ గిఫ్ట్ పథకం 2026
ఈ లక్ష్యంతోనే "తమిళనాడు పొంగల్ గిఫ్ట్ పథకం 2026" కింద అద్భుతమైన బహుమతులు, నగదును అందిస్తుంది. రేషన్ కార్డులు ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదు సాయం అందించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా, దీనికి అదనంగా ప్రత్యేకమైన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ను కూడా ఇవ్వనుంది.
జనవరి రెండో వారంలో ఈ పథకం ప్రారంభించనున్న సీఎం
ఈ పొంగల్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జనవరి రెండోవారంలో ప్రారంభించనున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు, జనవరి మొదటి వారంలోనే రేషన్ దుకాణాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టోకెన్లను అందజేయనున్నారు. టోకెన్పై పేర్కొన్న తేదీ, సమయం ప్రకారం లబ్ధిదారులు తమకు కేటాయించిన రేషన్ దుకాణాలకు వెళ్లి నగదుతో పాటు కానుకలను కూడా పొందవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పండుగ గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు నగదు
పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్లో భాగంగా ప్రతీ రేషన్ కార్డుదారునికి ఒక కిలో బియ్యం, ఒక కిలో పంచదార, ఒక పొడవాటి చెరుకు గడ, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు వంటి నిత్యావసరాలను అందించనున్నారు. గత ఏడాది ప్రభుత్వం కేవలం గిఫ్ట్ హ్యాంపర్ను మాత్రమే పంపిణీ చేయగా, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రూ.3,000 నగదు సాయాన్ని ఇవ్వటం గమనించదగిన అంశం. ఈ పొంగల్ కానుక ప్రజలకు పండుగ ఖర్చుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంచనా.












Click it and Unblock the Notifications