తేనెటీగల దాడికి అన్నదాత బలి
మైసూరు: పొలం పనులు చేసుకుంటున్న సమయంలో పెద్ద తేనెటీగలు దాడి చెయ్యడంతో అన్నదాత మరణించిన సంఘటన కర్ణాటకలోని మైసూరు నగరం సమీపంలోని జిబుకహళ్ళి గ్రామంలో జరిగింది.
కేఆర్ నగర తాలుకా జిబుకహళ్ళి గ్రామంలో బందిగౌడ (63) అనే రైతు నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మంగళవారం సాయంత్రం బందిగౌడ తన పొలంలో పని చేసుకుంటున్నారు.
అదే సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పెద్ద తేనెటీగలు బందిగౌడ మీద దాడి చేశాయి. ఆయన శరీరాన్ని చుట్టుముట్టి కరవడంతో కుప్పకూలిపోయారు. పక్క పొలంలో పని చేస్తున్న రైతులు విషయం గుర్తించారు.
వెంటనే నిప్పంటించి పొగ పెట్టి తేనెటీగలను అక్కడి నుంచి తరిమివేశారు. బందిగౌడను కేఆర్ నగర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు చెప్పారు. తహసిల్దార్ జీ.హెచ్. నాగరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అటవీ శాఖ అధికారుల నిర్లక్షం వలనే అటవీ ప్రాంతం నుంచి నిత్యం తేనెటీగలు వచ్చి రైతుల మీద దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. బందిగౌడ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.