అక్రమ సంబంధం.. కూతురికి నరకం చూపించిన తండ్రి..
మొల్లపుర : తన వివాహేతర సంబంధం గురించి కూతురికి తెలిసిందన్న కోపంతో.. ఆమె పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించాడో దుర్మార్గపు తండ్రి. త్రిపురలోని మొల్లపురలో వెలుగుచూసిన ఈ ఘటనలో.. సదరు కీచక తండ్రి కన్న కూతురి పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించాడు.
అక్రమ సంబంధం గురించి కూతురికి తెలిసిపోవడంతో.. ఆమెను గొలుసులతో కట్టేసి ఇంట్లో బంధించాడు. అనంతరం ఇనుప రాడ్లతో ఆమె శరీరంపై వాతలు పెట్టాడు. రెండు రోజులుగా ఈ నరకాన్ని మౌనంగా అనుభవిస్తూ వస్తోంది బాధితురాలు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో.. ఈ చిత్రవధ నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో.. ఆమె వేదనంతా ఆరణ్య రోదనే అయ్యింది.
కాగా, ఎలాగోలా సదరు కీచక తండ్రి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇరుగుపొరుగు వారికి తన గోడు వెల్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. దీంతో విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయడంతో.. ఆ కీచక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలైన నజియా బేగం.. నిందితుడి అరెస్టు అనంతరం మీడియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తనను గొలుసులతో కట్టేసి, తండ్రి జవహర్ మియా తనకు నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్రమ సంబంధం విషయంలో తండ్రితో గొడవపడి.. తన తల్లి ఇంటినుంచి వెళ్లిపోయినట్లుగా నజియా వాపోయింది.