పట్టాలు తప్పిన గూడ్స్: వరద నీటితో పోటెత్తిన నదిలో పల్టీ కొట్టిన వ్యాగన్లు..నుజ్జునుజ్జు
భువనేశ్వర్: ఒడిశాను భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉంటోంది. మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 11 జిల్లాలపై అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటోంది. భారీ నుంచి అతిభారీ వర్షాల వల్ల ఈ 11 జిల్లాల్లో ముగ్గురు మరణించారు. సుమారు తొమ్మిది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కేంద్రపారా, ఖుర్దా, కటక్, జగత్సింగ్ పూర్, పూరి వంటి జిల్లాల్లో భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యాయి. వందలాది హెక్టార్లలో పంట నీట మునిగింది.
ఒడిశా అతలాకుతలం..
భారీ వర్షాల వల్ల సంభవించి ప్రమాదాల్లో కేంద్రపారా జిల్లాలో ఇద్దరు, ఖుర్దాలో ఒకరు మరణించినట్లు ఒడిశా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఖుర్దా జిల్లాలోని నువాగఢ్ బ్లాక్ పరిధిలో ఖంబేశ్వర్ పట్సానీ అనే 29 సంవత్సరాల వ్యక్తి కాలువలో కొట్టుకునిపోయాడు. కేంద్రపారా జిల్లాలోని బేణిపూర్, బాడాబెటారాల్లో నర్మదా సాహు అనే మహిళ, అభయ్ మోహపాత్ర అనే వృద్ధుడు గోడ కూలడం వల్ల మృతి చెందినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
వ్యాగన్లు నుజ్జునుజ్జు..
కాగా- గుజరాత్లోని ఫిరోజ్ నగర్ నుంచి ఒడిశాలోని ఖుర్దా రోడ్ జంక్షన్కు బయలుదేరిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అంగుల్-తాల్చేర్ రోడ్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. ఈ ఘటనలో తొమ్మిది వ్యాగన్లు నదిలో పడ్డాయి. తాల్చేర్ రోడ్ స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి మీద నుంచి వెళ్తోన్న సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
నందీరా నదిలో పడ్డ వ్యాగన్లు..
ఫలితంగా బోగీలు నదిలో పడ్డాయి. రైలింజిన్ పూర్తిగా పక్కకు ఒరిగిపోయంది. వ్యాగన్లన్నీ ఒకదాని మీద ఒకటి పడ్డాయి.. నుజ్జునుజ్జు అయ్యాయి. గోధుమల లోడును తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల వల్ల బ్రిడ్జి కింద ప్రవహిస్తోన్న నందీరా నది పొంగిపొర్లుతోంది. అదే సమయంలో పట్టాలు తప్పడం వల్ల తొమ్మిది వ్యాగన్లు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
తాల్చేర్లో రికార్డు స్థాయి వర్షపాతం..
ఈ ఘటనలో పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, యుద్ధ ప్రాతిపదికన వాటిని సరి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాల్చేర్, అంగుల్ మధ్య రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాల్చేర్లో రికార్డు స్థాయిలో 160 మిల్లీమీటర్లు, అంగుల్లో 74 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఈ ప్రమాదం వల్ల పట్టాలు పూర్తిగా ధ్వంసం కావడం, బ్రిడ్జి కూడా దెబ్బతిన్నది. దీనితో ఈ మార్గంలో రాకపోకలు సాగించే 12 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మరో ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు.
రద్దయిన రైళ్లివే..
08105
రూర్కేలా-పూరీ
స్పెషల్,
08106
పూరీ-రూర్కేలా,
02862
భువనేశ్వర్-రూర్కేలా
ఇంటర్సిటీ,
02866
పూరీ-లోక్మాన్య
తిలిక
టెర్మినల్,
08493
భువనేశ్వర్-బాలంగిర్
ఇంటర్సిటీ
స్పెషల్,
08494
బాలంగిర్-భువనేశ్వర్
ఇంటర్సిటీ,
08451
హాతియా-పూరీ,
08452
పూరీ-హాతియా,
08425
పూరీ-దుర్గ్
స్పెషల్,
08426
దుర్గ్-పూరీ,
08127
రూర్కేలా-గుణుపూర్
స్పెషల్,
08128
గుణుపూర్-రూర్కేలా
స్పెషల్
ఎక్స్ప్రెస్లను
రద్దు
చేశారు.
బుధవారం
కూడా
ఆయా
రైళ్లు
పట్టాలెక్కవని
చెప్పారు.
తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్
ఒడిశా తీర ప్రాంత జిల్లాలకు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భువనేశ్వర్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్, మరి కొన్నింటికి ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పే సమయంలోనూ భారీ వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నందున కల్వర్టులు, కాజ్వేలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులు లోకో పైలెట్లను ఆదేశించారు.