అక్కడే సగం గెలిచిన సీఎం: నాటకీయ పరిణామాల మధ్య..!!
పాట్నా: బిహార్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యునైటెడ్)-రాష్ట్రీయ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్షను నిరూపించుకోవడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనత పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. బల పరీక్ష అరగంట ముందు ఈ పరిణామం సంభవించింది.
నిజానికి- తన పదవికి రాజీనామా చేయడానికి విజయ్ కుమార్ సిన్హా తొలుత అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయబోనంటూ మొండికేశారు. బీజేపీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడాయన. జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటాన్ని ముందు నుంచీ గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోన్నారు. ఈ పొత్తు పట్ల ఇదివరకు ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు.
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే స్పీకర్ స్థానంలో ఉండటం వల్ల బల నిరూపణ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని జేడీయూ-ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదయం సభ ఆరంభమైన వెంటనే అధికార పార్టీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జేడీయూ, ఆర్జేడీకి చెందిన ఎనిమిది సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అవి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ తొలుత స్పీకర్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైన కొద్దిసేపటికే స్పీకర్ పదవి నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పారు. 243 మంది సభ్యులు గల బిహార్ అసెంబ్లీలో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి 165 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి చెందిన స్పీకర్ కూడా రాజీనామా చేయడంతో బల నిరూపణకు ముందే మహా కూటమి ప్రభుత్వం సగం గెలిచినట్టయింది.
ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా సీబీఐ అధికారులు- బిహార్లో దాడులు చేపట్టారు ఆర్జేడీ నాయకుల నివాసాలను లక్ష్యంగా చేసుకున్నారు. శాసన మండలి సభ్యులు సునీల్ సింగ్, సుబోధ్ సహాయ నివాసంపై ఈ తెల్లవారు జాము నుంచీ ఈ దాడులు కొనసాగుతున్నాయి. భూములకు బదులుగా రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు.