ప్రధాని మోదీ అలా గెలిచారు- విగ్రహం ప్యూర్ గోల్డ్..!!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన తిరుగులేని విజయం అక్కడి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. గత ఏడాది చివర్లో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 156 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు. ఈ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఛరిష్మా కారణమనేది తెలిసిన విషయమే.
ఆనం ఎఫెక్ట్: జగన్తో సుచరిత భేటీ- భర్తతో కలిసి: ఆ విషయంపై క్లారిటీ
పార్టీకి ఈ స్థాయిలో విజయాన్ని అందించిన ప్రధాని మోదీకి గుజరాత్ లోని సూరత్ కు చెందిన బసంత్ బోహ్రా అనే స్వర్ణకారుడు వినూత్నంగా కృతజ్ఞలు తెలిపారు. రాధికా చైన్స్ యజమాని అయిన ఆయన ప్రధాని మోదీ విగ్రహాన్ని బంగారంతో తయారు చేశారు. బస్ట్ సైజ్ విగ్రహం ఇది. 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగించారు. ఈ విగ్రహం బరువు 156 గ్రాములు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించినందుకు గుర్తుగా 156 గ్రాముల బంగారంతో దీన్ని తయారు చేయించారు. మోదీకి వీరాభిమాని బసంత్ బోహ్రా. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు చెప్పారు.
సుమారు 20 మంది స్వర్ణ కళాకారులు తమ ఫ్యాక్టరీలో ఈ బస్ట్ సైజ్ విగ్రహాన్ని తయారు చేశారని బసంత్ బోహ్రా తెలిపారు. దీనికి మూడు నెలల సమయం పట్టిందని వివరించారు. బసంత్ బోహ్రా స్వరాష్ట్రం.. రాజస్థాన్. 20 సంవత్సరాలుగా ఆయన సూరత్ లో నివసిస్తోన్నారు. బంగారు క్రయ విక్రయాల వ్యాపారంలో స్థిరపడ్డారు. రాధికా చైన్స్ అనే సంస్థను స్థాపించారు.
ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచీ కొనడానికి ఎగబడుతున్నారు మోదీ అభిమానులు. తాను దీన్ని విక్రయించదలచుకోలేదని, చిరస్మరణీయమైన విజయానికి గుర్తుగా తానే అట్టిపెట్టుకుంటానని చెప్పారు. బహిరంగ మార్కెట్ లో దీన్ని విక్రయానికి ఉంచితే కనీసం 12 లక్షల రూపాయల విలువ చేస్తుందని అన్నారు.