దేవదాస్ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
కోల్కతా: అలనాటి నటి సుచిత్రా సేన్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సుచిత్రా సేన్ కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయస్సు 82. ఆరోగ్య సమస్య కారణంగా ఆమె డిసెంబర్ 23న ఆసుపత్రిలో చేరారు.
సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు అంతర్జాతీయ ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఖ్యాతి గాంచారు. దేవదాస్ చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.
సుచిత్రా సేన్ను 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఉత్తమ్ కుమార్తో కలిసి సుచిత్రా సేన్ నటించిన పలు సినిమాలు బెంగాలీ చరిత్ర స్వర్ణయుగంలో ప్రముఖ భాగంగా పేర్కొంటారు. ఆమె బెంగాలీ వ్యాపారవేత్తను వివాహమాడారు. ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ ఆమె కూతురు. రీమాసేన్, రైమాసేన్ ఆమె మనవరాళ్లు. ఆమె చాలాకాలంగా ఒంటరిగా జీవిస్తున్నారు.