చిరుతను ఎత్తుకుని సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ, అటవి శాఖ సిబ్బంది, ఫోటోలు వైరల్!
మైసూరు: అటవి ప్రాంతం నుంచి వచ్చి గ్రామం సమీపంలోని ఆవులు, మేకలను వేటాడి చంపి తింటూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న చిరుతను పట్టుకోవడానికి అటవి శాఖ అధికారులు చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. చిరుత మరణించడంతో దానితో సెల్ఫీలు తీసుకోవడానికి గ్రామస్తులు పోటీ పడ్డారు.
కర్ణాటకలోని మైసూరు నగరం సమీపంలోని అటవి ప్రాంతం నుంచి సమీప గ్రామాల్లో చిరుతలు వచ్చి పశువులను చంపితింటున్నాయి. గ్రామస్తులు సమాచారం ఇచ్చిన వెంటనే అటవి శాఖ అధికారులు వెళ్లి చిరుతలను పట్టుకుని అటవి ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు.

మైసూరు పరిసర ప్రాంతాల్లో నిత్యం ఇలా చిరుతలను పట్టుకుని అటవి ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. గురువారం ఉదయం గోహళ్ళి గ్రామం శివార్లలో చిరుత ప్రత్యక్షం అయ్యింది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవి శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు.
అటవి శాఖ అధికారులు ముందుగా ఏర్పాటు చేసిన గుంతలో చిరుత పడేవిధంగా ప్రయత్నించారు. చిరుత గుంతలో పడిపోయింది. గుంతలో పడిన చిరుతకు మత్తు మందు ఇచ్చి వల వేసిన అటవి శాఖ సిబ్బంది దానిని బయటకు లాగేశారు. అయితే గుంతలో పడిన చిరుతను బలంగా బయటకు లాగడంతో తీవ్రగాయాలై అక్కడే మరణించింది.

చిరుతను బయటకు తీసుకురావడంతో అది అప్పటికే మరణించిందని స్థానికులు తెలుసుకున్నారు. అంతే మరణించిన చిరుతను ఎత్తుకుని సెల్ఫీలు తీసుకోవడానికి స్థానికులు, యువకులు, పిల్లలు పోటీ పడ్డారు. మరణించిన చిరుతతో స్థానికులు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications