ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్: ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు బెదిరింపులకు గురిచేసిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు పిటిఐ నివేదించింది. ఆ వ్యక్తి ఉదయం గిర్గావ్ ప్రాంతంలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ పబ్లిక్ నంబర్కు మూడు నాలుగు కాల్స్ చేశాడు.
బెదిరింపు కాల్స్కు సంబంధించి వ్యక్తిని దహిసర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ సీఈఓ, తరంగ్ జియాంచందానీ మాట్లాడుతూ.. 'మాకు 8 సార్లు బెదిరింపు కాల్లు వచ్చాయి, ఈ రోజు మేము కాల్ చేసిన వ్యక్తిని ఉగ్రవాదిగా పరిగణిస్తున్నాము, మేము ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసాము. మేము మా సెక్యూరిటీ గార్డులకు కూడా చెప్పాము' అని అన్నారు.
"ముకేష్ అంబానీ, కుటుంబ సభ్యులను బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది" అని ఆమె తెలిపారు.
కాగా, గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కనిపించడం కలకలం రేపింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమైంది.