పెళ్లై ఆరేళ్లైనా శోభనానికి ఒప్పుకోని భార్య: కోర్టుకు భర్త, విడాకులు
మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన ఓ ప్రభుత్వాధికారికి ఆరేళ్లకు క్రితం వివాహం జరిగింది. అయితే ఆయనకు ఇప్పటి వరకు శోభనం జరగలేదట. దీంతో సహనం కోల్పోయిన అతడు కోర్టును ఆశ్రయించాడు. తనకు ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు. దీంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల క్రితం మైసూరుకు చెందిన సదరు ప్రభుత్వోద్యోగికి, మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న సదరు మహిళకు వివాహం జరిగింది. ఆ సమయంలో, వివాహం తర్వాత భర్త ఉన్న చోటికే తన ఉద్యోగాన్ని బదిలీ చేసుకోనున్నట్లు ఒప్పందం కుదిరింది.
అంతేగాక, వివాహమయ్యాక వరుడి ఇంటి వద్ద రిసెప్షన్, ఆ తర్వాత వధువు ఇంట్లో శోభనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే శోభనానికి వధువింటి వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో శోభనం జరగలేదు.
ఇలా శోభనాన్ని వాయిదా వేస్తూ ఆరేళ్లపాటు వెళ్లదీసింది. అంతేగాక, ఉద్యోగాన్ని సైతం బదిలీ చేయకుండా అతనికి చుక్కలు చూపించింది. దీంతో మండిపడిన భర్త తనను మోసం చేస్తున్నారని కోర్టుకు ఎక్కారు.
దాంపత్య జీవితమంటేనే పారిపోతూ.. తన జీవితాన్ని ఆ మహిళ నాశనం చేసిందంటూ విడాకులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. కాగా, భర్తపై ఆ మహిళ వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసుల్లో తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది.
తన భార్య దాంపత్య జీవితానికి అంగీకరించట్లేదని, అంతేగాకుండా భర్త కోసం ఉద్యోగం కూడా బదిలీ చేసుకోనంటుందనే ఆరోపణలతో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జడ్జి ఆ మహిళ నుంచి ఆ భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సదరు వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు.