నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తెర మీదికి కొత్త ధర్మాసనం: న్యాయమూర్తులు వీరే..విచారణ రేపే!
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె తప్పుకొన్న నేపథ్యంలో.. కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం అనివార్యమైంది. తాజాగా- కొత్త ధర్మాసనం ఏర్పాటు కావడంతో షెడ్యూల్ ప్రకారమే బుధవారం మరోసారి సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది ఈ కేసు.
కొత్తగా ఒక్కరే..

తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్, ఎస్ ఏ బొపన్నలను నియమించారు. బొపన్న మినహా.. మిగిలిన ఇద్దరూ ఇదివరకే ఏర్పాటైన బెంచ్ లో సభ్యులుగా కొనసాగారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డె స్థానంలో బొపన్న నియమితులు అయ్యారు. ఈ బెంచ్ లో చోటు చేసుకున్న మార్పు అదొక్కటే. కొత్తగా ఏర్పాటయ్యే ధర్మాసనంలో ముగ్గురూ కొత్త న్యాయమూర్తులను నియమించవచ్చంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.

మంగళవారమే విచారణ చేపట్టాల్సి ఉన్నా..
లిస్టింగ్ ప్రకారం- మంగళవారమే అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఎస్ ఏ బొబ్డె, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ భానుమతిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తొలుత వాదోపవాదాలను ఆరంభించింది. ఆ వెంటనే- ఎస్ ఏ బొబ్డె జోక్యం చేసుకున్నారు. తాను రివ్యూ పిటీషన్ విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. కొత్త ధర్మాసనానికి దీన్ని బదలాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రానికంతా.. కొత్త ధర్మాసనం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications