జస్టిస్ రమణ రాకతో మారిన సీన్-బడుగులకు సుప్రీం భరోసా-వారంలో కీలక తీర్పులు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బడుగు వర్గాల హక్కుల పరిరక్షణ విషయంలో గత వారం రోజుల్లోనే సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చారిత్రకంగా నిలుస్తున్నాయి. జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ కేసైనా, దేశంలో ఆక్సిజన్ కొరతపైనా, కోవిడ్ రెండోదశ ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యంపైనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
జస్టిస్ రమణ ఎంట్రీతో
సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నేతృత్వంలోని ఛీఫ్ జస్టిస్ ధర్మాసనం దేశంలోని పలు కీలక అంశాలపై అంతే కీలకమైన తీర్పులు వెలువరిస్తూ వస్తోంది. ఇందులో ఏమీ ప్రత్యేకత లేకపోయినా ఈ తీర్పులన్నీ దేశంలో బడుగు వర్గాల ప్రయోజనాల్ని కాపాడేలా ఉండటంతో న్యాయవ్యవస్దపై సామాన్యుల్లో నమ్మకం పెరుగుతోంది. దీంతో జస్టిస్ రమణ సీజేగా రాక తర్వాత సుప్రీంకోర్టు వైఖరిలోనే మార్పు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది.
సిద్ధిక్ కప్పన్ కేసులో యోగీ సర్కార్కు షాక్
కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్పై తీవ్రమైన ఆరోపణలతో కేసులు నమోదు చేసిన యూపీ పోలీసులు... ఆయన్ను నిర్భంధించారు. అక్కడా ఆయనకు తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ట్రయల్ ఖైదీగా ఉన్నప్పటికీ కనీసం ఆయనకు కరోనా టెస్టు కూడా చేయకుండా పోలీసులు కాఠిన్యం చూపారు. దీంతో సిద్ధిక్ కప్పన్ భార్య దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. యూపీ న్యాయవాదులు ఎంతగా వాదించినా సుప్రీం మాత్రం తనదైన తీర్పే ఇచ్చింది.
Recommended Video
ఆక్సిజన్ కొరత, కోవిడ్ వేవ్ నిర్వహణపై
కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యంపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం కేంద్రం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరిస్ధితులు చక్కదిద్దడంలో విఫలమైతే తామే లాక్డౌన్ విధిస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో రోగుల అడ్మిషన్ విషయంలో రెండు వారాల్లో జాతీయ విధానం రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించకుండా మీడియాను ఆపడం కుదరదని మరో తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే దేశద్రోహం చట్టం యొక్క చట్టబద్ధతపై విచారణ జరిపేందుకు సైతం అంగీకరించింది. దీంతో ఈ తీర్పులన్నీ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.