ఒబామా భారత పర్యటన షెడ్యూల్: భద్రతా వలయంలో ఢిల్లీ
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఆయన జనవరి 25న ఉదయం 4.45 గంటలకు ఢిల్లీ రానున్నారు. 10:10 గంటలకు రాష్ట్రపతి భవన్కు చేరుకొని.. అక్కడి నుంచి 10:40కి రాజ్ఘాట్ వెళ్తారు. 11:20కి హైదరాబాద్ హౌజ్లో ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతారు.
అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఇచ్చే విందులో ఒబామా పాల్గొంటారు. జనవరి 26న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:40 నుంచి 3:10 వరకు సిఈవోల సదస్సుకు హాజరవుతారు. 6:50 నుంచి 7:20 వరకు ప్రసంగిస్తారు. ఆరోజు రాత్రి ప్రధాని ఇచ్చే విందులో పాల్గొంటారు. 27న ఉదయం 10:40కి సిరిఫోర్ట్కు వెళ్తారు. మధ్యాహ్నం 3:05 నుంచి 4:05 మధ్య తాజ్మహల్ సందర్శించి సాయంత్రం 5:50 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

కాగా, గణతంత్ర వేడుకల కోసం గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేస్తున్న భద్రతా సిబ్బంది ఆరు రోజుల ముందే ఢిల్లీలోని ఇండియాగేట్ను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇప్పటి నుంచే సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరిస్తున్నారు. మంగళవారం ఇండియాగేట్, రాజ్పథ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా యుద్ధట్యాంకులు, ఆర్మీ వాహనాలు, భారీగా సాయుధ బలగాలు కనిపించాయి.
అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్యఅతిథిగా వస్తుండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నేలమీద, గాలిలో అసాధారణ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాకు చెందిన నిఘా సంస్థ, సీఐఏ, నేవీ సీల్స్, భారత్కు చెందిన రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ, ఆర్మీ బలగాలు అనుక్షణం భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
కాగా, భారత్ పర్యటనకు ముందు బరాక్ ఒబామా కీలక ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్లో ఆయన ప్రసంగించారు. ఆర్థిక సంక్షోభానికి ముందున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒబామా తెలిపారు. ఉద్యోగ కల్పన జరుగుతోందని, 1999 సంవత్సరం నాటి పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, పవన విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని ఒబామా వెల్లడించారు.












Click it and Unblock the Notifications