ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం .. కొడుకుతో సవతి కూతురిపై అత్యాచారం
ఆస్తికోసం ఓ సవతి తల్లి దారుణానికి పాల్పడింది. తాను ఒక ఆడదాన్ని అన్న విషయం మరచి చాలా అమానుషంగా ప్రవర్తించింది. కేవలం ఆస్తి కోసం వావివరుసలు మరచి, విచక్షణ మరచి ఓ తల్లీ, కొడుకులు చేసిన ఘాతుకంపై ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఏకంగా సోదరి వరసైన అమ్మాయిపై అన్న అత్యాచారం చేస్తే దగ్గరుండి సహకరించిన సవతి తల్లి తీరు సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేస్తుంది.
జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ ప్రాంతానికి చెందిన మహిళ తన భర్త చనిపోవడంతో నాలుగేళ్ల క్రితం మరొకరిని వివాహం చేసుకుంది. ఆమెకు పన్నెండేళ్ల వయసున్న కొడుకున్నాడు. ఆమె వివాహం చేసుకున్న భర్త సైతం భార్య చనిపోవడంతోనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే అతనికి పదహారేళ్ళ కూతురు ఉంది. మొదట్లో సవతి కుమార్తెను బాగానే చూసినప్పటికీ ఆ తర్వాత ఆస్తి మొత్తం ఆ అమ్మాయి పేరు మీద ఉన్నట్లుగా తెలియడంతో అప్పటినుండి ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తుంది సదరు మహిళ.
కూతురు మేజర్ అయితే, ఆ ఆస్తులు మొత్తం ఆమెకు చెందుతాయని తెలుసుకున్న భార్య, ఎలాగైనా ఆస్తులను సొంతం చేసుకోవాలని ఓరోజు సవతి కూతురును, తన కొడుకును తీసుకొని దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ సవతి కూతురుని బంధించి కొడుకుతో అత్యాచారం చేయించింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించింది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా లోలోపలే మదనపడుతూ ఉంటున్న అమ్మాయిపై, మరోమారు అలాగే అత్యాచారం చేయించాలని ప్రయత్నం చేసింది.
దీంతో అక్కడి నుండి తప్పించుకుని పారిపోయిన సదరు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. చెరువులో దూకి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించిన యువతిని స్థానికులు కాపాడి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో యువతి తను ఆత్మహత్య చేసుకోవాలి అనుకోడానికి తన సవతి తల్లి కారణమని జరిగిందంతా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సవతి తల్లిని, కొడుకుని వారికి సహకరిస్తున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.