మోడీ ఫోన్, టీవీ అపహరణ! ఫోటోగ్రాఫర్ ఉబ్బితబ్బిబ్బు
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పంచకులకు వచ్చిన విషయం తెలిసిందే. మనోహర్ లాల్ ఖట్టార్ ప్రమాణ స్వీకారం పంచకులలో జరిగింది. ఈ కార్యక్రమానికి మోడీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. అయితే, మోడీ బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీగా 1990లలో హర్యానాలో పని చేశారు.
అప్పుడు మోడీ మొబైల్ ఫోన్, టీవీ తదితరాలు చోరీకి గురయ్యాయి. 20 ఏళ్ల క్రితం.. అంటే 1992 - 1999 మధ్యలో మోడీ పంచకులలో ఉన్నారు. బీజేపీ నేత మహావీర్కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన ఏడేళ్ల పాటు అదే ఇంటిలో ఉన్నారు.
1995లో మోడీ లేని సమయంలో ఆ ఇంటిలో చోరీ జరిగిందంట. ఆ సందర్భంగా దొంగలు మోడీకి చెందిన మొబైల్ ఫోన్తో పాటు టీవీ, కుర్తా-పైజామా, బ్లాంకెట్లను ఎత్తుకెళ్లారు. మోడీ అప్పుడు పంచకులలోని సెక్టర్ 7లో 481పీ హౌస్ నెంబరులో ఉండేవారు.
కాగా, హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఏర్పాట్లు జరిగిన సెక్టార్ 5లోని మేళా మైదానానికి సదరు ఇల్లు సమీపంలోనే ఉందట.
హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. హర్యానాలోని పంచకులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉదయం 11.22 గంటలకు హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ, ఖట్టర్తో ప్రమాణం చేయించారు.
తద్వారా హర్యానాకు తొలి బీజేపీ సీఎంగా ఖట్టర్ రికార్డులకెక్కారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా..ఢిల్లీలో శనివారం మోడీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ అఫిషియల్ ఫోటోగ్రాఫర్ అజయ్ కుమార్ సింగ్ ప్రధానిని వివిధ యాంగిల్స్లో కెమెరాలో బంధిస్తూ బిజీగా ఉన్న సమయంలో.. మోడీ ఆ ఫోటో గ్రాఫర్ వద్దకు వచ్చి, కెమెరా తన చేతిలోకి తీసుకొని క్లిక్ మనిపించిన విషయం తెలిసిందే.
దాన్ని కాసేపు పరిశీలించిన మోడీ ఆ తర్వాత.. ఫోటోగ్రాఫర్ అజయ్ కుమార్ను కొన్ని ఫోటోలు తీశారు. దీంతో, అజయ్ కుమార్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. దీపావళికి లభించిన అతిపెద్ద బహుమతిగా భావిస్తానని, ప్రధాని తీసిన ఫోటోను ఇంట్లో పెట్టుకుంటానని చెప్పాడు. తన ఫోటోను ప్రధాని చాలా నేర్పుగా తీశారని కితాబిచ్చాడు.