మహిళా మావోయిస్టు పూనం దేవి అరెస్టు
పాట్నా: అనేక సంవత్సరాల నుండి తప్పించుకుని తిరుగుతున్న మహిళా మావోయిస్టును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పూనం దేవి అనే మహిళా మావోయిస్టును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈమె పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు.
గయ జిల్లా ఎస్పీ మను మహరాజ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా కమాండర్ జైకరణ్ యాదవ్ ను పూనం దేవి వివాహం చేసుకుంది. తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడింది.
2002వ సంవత్సరంలో రోహతన్ డీఎఫ్ఓ సంజయ్ సింగ్ ను పూనం దేవి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆమె ప్రధాన నిందితురాలు. అప్పటి నుండి పూనం దేవి కోసం పోలిసులు గాలిస్తున్నారు. అయితే పూనం దేవి ఆమె భర్త జైకరణ్ తో సంబంధాలు తెంచుకుంది.
తరువాత పూనం దేవి తలయ్యా గ్రామానికి చేరుకుని అక్కడే ఉన్న వేరే వ్యక్తితో కలిసి జీవనం సాగిస్తున్నది. ఈమె తల మీద రూ. 50 వేలు రివార్డు ప్రకటించారు. అప్పటి నుండి ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కచ్చితమైన వివరాలు సేకరించిన పోలీసులు తలయ్యా గ్రామానికి చేరుకుని పూనం దేవిని అరెస్టు చేశారు.