ఎయిరిండియా విమానంలో 5 గంటల నరకం
Air India: ఘనత వహించిన ఎయిరిండియాకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ఉన్నారు. ఈ విమానం జేబీ మెడికల్ కాలేజీ మీద పడటం వల్ల పలువురు వైద్య విద్యార్థులూ తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇప్పుడు తాజాగా జైపూర్ నుండి దుబాయ్ వెళ్ళాల్సిన ఎయిరిండియా ఐఎక్స్ 196 విమానంలో ప్రయాణికులు సుమారు ఐదు గంటల పాటు నరకం అనుభవించారు. విమానంలో ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం వారికి చుక్కలు చూపించింది. సిబ్బంది నుంచి సరైన స్పందన సైతం లేకపోవడంతో ప్రయాణికులను మరింత ఆగ్రహోదగ్రులను చేసింది.

దీనికి కారణం లేకపోలేదు. విమానంలో ఏసీ ఉన్నట్టుండి స్తంభించిపోయింది. ఉక్క.పొతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఏసీ ఎందుకు ఆగిపోయింది? మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై సిబ్బంది నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం వారిని మరంత నిరాశకు గురి చేసింది.
ఎయిరిండియా విమానంలో తాను ఎదుర్కొన్న ఈ ఘటనపై జైపూర్కు చెందిన ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషన్ కన్సల్టెంట్ ఆర్జూ సేథీ ఓ వీడియో విడుదల చేశారు. దీన్ని తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రయాణంలో చవి చూసిన చేదు అనుభవాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించారు.
శనివారం జైపూర్ నుండి దుబాయ్ వెళ్లడానికి ఆమె తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఎయిరిండియా ఐఎక్స్ 196 ఫ్లైట్ ఎక్కారు. విమానం టేకాఫ్ కాకుండానే, ఎయిర్ కండిషనర్ పనిచేయకపోవడంతో లోపల ఉక్కబోతకు గురయ్యారు.. అల్లాడిపోయారు. అయిదు గంటలకు పైగా ఈ పరిస్థితి కొనసాగినట్లు ఆర్జూ తెలిపారు.
ప్రయాణికులు చెమటలు తుడుచుకుంటూ, తమను తాము విసరుకుంటూ, సహాయం కోసం పదేపదే హెల్ప్ బటన్ నొక్కడం కనిపించింది. అయినప్పటికీ విమాన సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆర్జూ తెలిపారు. తన మూడేళ్ల కుమారుడు చెమటతో తడిచిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సాంకేతిక లోపం కారణంగా ఏసీ పని చేయకపోయి వుండవచ్చని, దీనిపై కనీస సమాచారమైనా తమకు ఎందుకు ఇవ్వలేదని, జవాబుదారీతనం ఎక్కడ ఉందని ఆర్జూ సేథీ ఎయిరిండియా యాజమాన్యాన్ని ప్రశ్నించారు. విమానంలో అయిదు గంటలకు పైగా చిక్కుకుపోయామని, ఏసీ గానీ, సరైన సమాచారం లేదని, సిబ్బంది నుండి ఎటువంటి సహాయం అందలేదని అన్నారు.
ఇది తీవ్రమైన భద్రతా లోపమని ఆమె అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు విపత్కర పరిణామాలకు దారితీయకముందే ఎయిరిండియా అప్రమత్తం కావాలని అన్నారు. ఆర్జూ సేథీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 18 మిలియన్ల మందికి పైగా దీన్ని వీక్షించారు.












Click it and Unblock the Notifications