మోసాలకు చెక్: ఇకపై రైల్వే టికెట్ బుకింగ్కు ఆధార్ తప్పనిసరి
రైల్వే శాఖ.. టికెట్ల బుకింగ్లో మోసాలను అరికట్టే దిశగా పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. ఇకపై ఆధార్ సంఖ్య ఆధారంగానే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ను అనుమతించేందుకు సమాయత్తమవుతోంది.
ఢిల్లీ: రైల్వే శాఖ.. టికెట్ల బుకింగ్లో మోసాలను అరికట్టే దిశగా పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. ఇకపై ఆధార్ సంఖ్య ఆధారంగానే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ను అనుమతించేందుకు సమాయత్తమవుతోంది. నకిలీ గుర్తింపు కార్డులతో దళారులు అధిక సంఖ్యలో టికెట్లను అంతర్జాలంలో బుక్ చేసుకొని.. అనంతరం వాటిని అధిక మొత్తాలకు అమ్ముకుంటుండటం ప్రస్తుతం తీవ్ర సమస్యగా మారిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ పలు కీలక చర్యలు చేపట్టనుంది. రైల్వే సంబంధిత నూతన వ్యాపార ప్రణాళిక 2017-18ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఆవిష్కరించారు. భారతీయ రైల్వే ఆహార, విహార సంస్థ(ఐఆర్సీటీసీ) ద్వారా అంతర్జాలంలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ సంఖ్య నమోదు చేయడాన్ని త్వరలోనే తప్పనిసరి చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు.

వయో వృద్ధులు టికెట్లపై రాయితీని పొందాలంటే ఆధార్ సంఖ్యను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా సమర్పించేలా రైల్వేశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
వీటిలో భాగంగా నగదు రహిత టికెట్ల వ్యవస్థకు రైల్వేశాఖ అధిక ప్రోత్సాహమివ్వనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో 6 వేల పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్), వెయ్యి స్వీయ టికెట్ విక్రయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది.
సరకు రవాణా ద్వారా వస్తున్న ఆదాయం కొన్నేళ్లుగా తిరోగమనంలో ఉండటంతో.. దాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం సరకు రవాణా ఖాతాదారులను ఆకర్షించేలా 1.5 శాతం నుంచి 35 శాతం వరకు భిన్న రాయితీలు ప్రకటించింది. ఆయా రాయితీలు దక్కించుకోవడానికి సరఫరా చేయాల్సిన సరకుల కనీస బరువులను కూడా సూచించింది.
ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించేలా సౌకర్యాలను మెరుగుపర్చనుంది. కాగితపు టికెట్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం టికెట్లు, ట్యాక్సీ, ఆహారం, హోటళ్లలో గదులు, పర్యాటక ప్యాకేజీలు వంటివి బుక్ చేసుకోవడానికి వేర్వేరు యాప్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే, ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగాను.. అన్ని సేవలు అందుబాటులో ఉండేలా సమీకృత యాప్ను రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ మే నెలలో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అంతేగాక, కొండ ప్రాంతాల్లోని స్టేషన్లను కలుపుతూ నూతన పర్యాటక రైళ్లను ప్రారంభించనుంది రైల్వే శాఖ.












Click it and Unblock the Notifications