ఆధార్ డేటా కొనుగోలు?: రవిశంకర్ ప్రసాద్ ఏం చెప్పారంటే?
న్యూఢిల్లీ: ఆధార్ గోప్యతపై కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టతనిచ్చారు. కొన్ని వందల రూపాయలు చెల్లించి ఇతరుల ఆధార్ సమాచారం సులువుగా సేకరించవచ్చునంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణల్ని మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు.
ఆధార్ డేటా ఎప్పుడూ భద్రంతగానే ఉంటుందని, ఇతరుల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ డేటాకు గోపత్య లేదని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అని ప్రశ్నకు మంత్రి రవిశంకర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు.
ఈ ఏడాది జనవరి 4న యూఐడీఏఐ (ఆధార్ సంస్థ) ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సైబర్ విభాగం పోలీసులు ఆధార్ చట్టం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. 'విపక్ష నేతలు ఆధార్ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ డబ్బు చెల్లించి ఆధార్ సమాచారాన్ని చోరీ చేసినట్లు దేశంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆధార్ వివరాలపై గోప్యత ఉంటుందని అర్థమవుతోంది' అని రవిశంకర్ చెప్పారు.
అంతేగాక, 'ఆధార్ సంస్థ స్వయంగా ఓ వ్యక్తిపై డేటా దుర్వినియోగం చేశాడని ఫిర్యాదు చేయగా ఢిల్లీ సైబర్ విభాగం విచారణ చేపట్టింది. ఆధార్ డేటాపై అభద్రత భావాన్ని దూరం చేసుకోవాలి. రూ.500 చెల్లించి ఇతరుల ఆధార్ డేటా వ్యక్తిగత సమాచారాన్ని పొందడం తేలికంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆధార్పై పుట్టకొస్తున్న వదంతులను నమ్మవద్దు' అని మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.