పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్ధిగా భగవంత్ మాన్- సొంత సర్వేలో 93 శాతం ప్రజల మద్దతు ఆయనకే...
పంజాబ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం అభ్యర్ధిగా ఎవరుండాలనే దానిపై సర్వే నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు క్లారిటీ ఇచ్చేశారు. ఆ పార్టీ ఎంపీగా ఉన్న సీఎం అభ్యర్ధి రేసు అభ్యర్ధి భగవంత్ మాన్ కే తమ మద్దతు ప్రకటించారు. ఆప్ తాజాగా ఇందుకోసం వివిధ పద్ధతుల్లో నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈ మేరకు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ సీఎం అభ్యర్ధిగా భగవంత్ మాన్ ను ఆ పార్టీ ప్రకటించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రోజులుగా నిర్వహిస్తున్న టెలిఫోన్, ఆన్ లైన్ సర్వేలో దాదాపు 93 శాతం ప్రజలు పంజాబ్ సిఎం అభ్యర్ధిగా ఎంపీ భగవంత్ మాన్ కు మద్దతు లభించిదని పార్టీ ఛీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కూడా ఈ సర్వేలో మూడు శాతం ప్రజలు మద్దతు ప్రకటించడం విశేషం. ఆప్ అధినేత కేజ్రివాల్ కు అనుకూలంగా పడిన మరికొన్ని ఓట్లను చెల్లనివిగా ప్రకటించి తొలగించినట్లు పార్టీ వెల్లడించింది. ప్రజల మద్దతు పొందిన భగవంత్ మాన్ ఆప్ సీఎం అభ్యర్ధి మాత్రమే కాదని, కాబోయే పంజాబ్ సీఎం కూడా అని అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు.
పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అమరీందర్ సింగ్ రాజీనామా, కొత్త పార్టీ ప్రయోగం, ఆయనతో బీజేపీతో పొత్తు వంటి అంశాలు ఆప్ కు వరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొత్త ప్రయోగాలకు కూడా ఆప్ అధినేత కేజ్రివాల్ తెరదీశారు. సీఎం అభ్యర్ధిగా నేరుగా భగవంత్ మాన్ నే ఎంపిక చేసే అవకాశం ఉన్నా, ఆయన సూచన మేరకు సర్వే నిర్వహించడం ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఖరారు చేశారు. ఇందులోనూ ఆయనకే మద్దతు లభించడంతో పార్టీలో అరవింద్ కేజ్రివాల్ తర్వాత భగవంత్ మాన్ కు ఉన్న ఆదరణ మరోమారు స్పష్టమైంది.