కేజ్రీ: అజహర్పై ఖలీద్, చిద్దుపై షూవిసిరిన వ్యక్తికి టిక్కెట్
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ఇరవై మంది పేర్లను మొదటి విడతగా ఆదివారం ప్రకటించింది. జాతీయస్థాయిలో అగ్రనాయకులే లక్ష్యంగా లోకసభ అభ్యర్థుల తొలి జాబితాను ఎఎపి విడుదల చేసింది. ఎఎపి కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు రోజులు తర్వాత రానున్న ఎన్నికలకు తమ పార్టీ తరపున ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఓడిస్సా, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రల నుంచి లోక్సభకు పోటీ చేయనున్న సభ్యుల జాబితాను విడుదల చేశారు.
అమేథీ నుంచి రాహుల్ గాంధీపై కుమార్ విశ్వాస్, కపిల్ సిబల్పై అశుతోష్ పోటీ చేయనున్నారు. సల్మాన్ ఖుర్షీద్పై ముకుల్ త్రిపాఠి, సురేష్ కల్మాడీపై సుభాష్ వాడే పోటీ, మనీష్ తివారిపై హెచ్ఎస్ పూల్కా పోటీ, బిజెపి సీనియర్ నేత నితిన్ గడ్కరీపై అంజలీ దమానియా, ములాయంసింగ్ యాదవ్పై బాబా హరదేవ్ పోటీ చేయనున్నారు.
ముంబై ఈశాన్యం నుంచి మేథా పాట్కార్, ముంబై దక్షిణం నుంచి బరిలో మీరా సన్యాల్, గుర్గావ్ అభ్యర్థిగా యోగేంద్ర యాదవ్ పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ పైన విద్యావేత్త ఖలీద్ పర్వేజ్ పోటీ చేయనున్నారు. ఇక గతంలో ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పైన బూటు విసిరిన జర్నలిస్టు జర్నైల్ సింగ్కు కూడా ఎఎపి టిక్కెట్ ఇచ్చింది.
జర్నైల్ సింగ్ 2009లో చిదంబరం పైన బూటు విసిరి పతాక శీర్షికలకెక్కారు. ఆయన లోకసభకు పోటీ చేయనున్నారు. ఆదివారం ప్రకటించిన ఇరవై మంది జాబితాలో ఆయన పేరు ఉంది. పశ్చిమ ఢిల్లీ స్థానం కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని, ఈ మేరక్ ఎఎపి అభ్యర్థిగా ఎంపికైనట్లు తనకు సమాచారం వచ్చిందని జర్నైల్ తెలిపారు. కాగా, నిజాయితీపరులైన సభ్యలను పార్లమెంట్కు పంపడమే తమ లక్ష్యమని పార్టీ నేత మనీస్ సిసోడియా వ్యాఖ్యానించారు.