హర్యానా ఎన్నికల్లో అనూహ్య పరిణామం-కాంగ్రెస్ కు మద్దతిచ్చి తప్పుకున్న ఆప్ అభ్యర్ధి..!
ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న హర్యానాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ అభ్యర్ది పోటీ నుంచి తప్పుకున్నారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండబోతున్నాయని కాంగ్రెస్ మరోసారి వ్యాఖ్యానించింది.
హర్యానాలోని నీలోఖేరీ అసెంబ్లీ స్ధానంలో ఆప్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అమర్ సింగ్ .. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ధరం పాల్ కు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోవడంతో ఆప్ అభ్యర్ధి ఇలా మద్దతిచ్చినట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. హర్యానా ఎన్నికల్లో ప్రజల ఆశలన్నీ కాంగ్రెస్ పార్టీపైనే ఉన్నాయని తెలిపింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వీరితో పాటు ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, జేజేపీ-ఏఎస్పీ కూటములు పోటీలో ఉన్నాయి. వీరు కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేస్తోంది. అయితే ఈ బహుముఖ పోటీలో
కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తాజాగా పలు సర్వేలు అంచనా వేశాయి. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కూడా పెరుగుతున్నాయి. ఈ నెల 5న హర్యానా అసెంబ్లీలో 90 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.












Click it and Unblock the Notifications