రాజ్యసభకు స్వాతి మలివాల్..: సీఎం కీలక నిర్ణయం
Swati Maliwal: స్వాతి మలివాల్.. పరిచయం అక్కర్లేని పేరు. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది ఆమె మీద. మణిపూర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేశారామె ఇదివరకు. మహిళల రక్షణ కోసం దేశ రాజధాని అర్ధరాత్రి వేళ విస్తృతంగా తనిఖీలనూ చేపట్టారు.
ఇప్పుడామె వార్తల్లోకెక్కారు. పెద్దల సభలో అడుగు పెట్టబోతోండటమే దీనికి కారణం. ఢిల్లీ, పంజాబ్లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలివాల్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.

స్వాతి మలివాల్తో పాటు సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాలను రీనామినేట్ చేసింది. వారిద్దరూ రెండోసారి కూడా రాజ్యసభలో కొనసాగుతారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేడు సమావేశమైంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.
స్వాతి మలివాల్ను తొలిసారిగా రాజ్యసభను నామినేట్ చేశామని రాజకీయ వ్యవహారాల కమిటీ వెల్లడించింది. సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాలను రీ నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నెల 29వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. చాలినంత సంఖ్యాబలం ఉండటం వల్ల స్వాతి మలివాల్, సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాల గెలుపు సులువేనని తెలుస్తోంది.
ఫెమినిస్ట్గా గుర్తింపు పొందిన స్వాతి మలివాల్.. 2015లో ఢిల్లీ మహిళా ఛైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. మహిళలపై యాసిడ్, లైంగిక దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించారు. గృహహింస చట్టంపై అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఉదంతంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications