సుప్రీం ఆగ్రహం: ఆరే కాలనీలో చెట్లను నరికింది చాలు..ఇక ఒక్కటి కూడా నేలకొరిగేందుకు వీల్లేదు
న్యూఢిల్లీ: ముంబై మెట్రో నిర్మాణం కోసం ఆరే కాలనీలో చెట్లు నరకడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ముంబై నగరంలో నిరసనలు కొనసాగుతున్న విషయం విదితమే. ఆరే అడవుల్లో చెట్లు నరకడం అక్కడ పర్యావరణ ప్రేమికులు ఆందోళన ఉధృతం చేయడంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అత్యవసర కేసు కింది పరిగణించిన సుప్రీం ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసును విచారణ చేసిన ప్రత్యేక ధర్మాసనం చెట్లు కొట్టివేయడాన్ని వెంటనే నిలిపివేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటి వరకు నరికేసిన చెట్లు చాలని ఇకపై ఒక్క చెట్టు కూడా నేలకొరగడానికి వీలు లేదంటూ అత్యున్నత ధర్మాసనం ఫడ్నవీస్ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. చెట్లను తొలగించడంపై ఓ లా స్టూడెంట్ ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని లేఖ కిందకు మార్చి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కు పంపింది సుప్రీంకోర్టు. ఆరే కాలనీలో ముంబై మెట్రో కార్పొరేషన్ అధికారులు మెట్రో నిర్మాణం కోసం చెట్లు నరకడం పై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒక్క స్థానికుల నుంచే కాకుండా ఇతర పర్యావరణ ప్రేమికులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదిలా ఉంటే నిరసనల్లో పాల్గొంటున్న పర్యావరణ ప్రేమికులు ఇతర స్థానికులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు కేసులు నమోదు చేవారు. ఆదివారం రోజున 29 మందికి ముంబై సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరే కాలనీలో చెట్లు నరికివేత సందర్భంగా నిరసనకు దిగిన నేపథ్యంలో అరెస్టు అయిన వారందరినీ ఆదివారం రోజున విడుదల చేసినట్లు మహారాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఇప్పటివరకు చేసింది చాలని ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో స్టేటస్ కో మెయింటెయిన్ చేయాలని సూచించింది. కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కారుకు సూచిస్తూ కేసును ఈ నెల 21 వాయిదా వేసింది సుప్రీంకోర్టు