అభినందన్ అంటే స్వాగతమని అర్థం... ఇప్పుడు అర్థమే మారిపోయింది: మోడీ
అభినందన్ అంటే అర్థం స్వాగతమని అయితే ఇప్పుడు దాని అర్థం మారిపోతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్కు పట్టుబడి దాదాపు 48 గంటల తర్వాత విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ను ధైర్యశాలిగా అభివర్ణించారు ప్రధాని మోడీ. డిక్షనరీలో ఉన్న పదాలకు అర్థం మార్చడం ఒక్క భారతదేశంతోనే సాధ్యమవుతుందన్న విషయం ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని అన్నారు.
భారత గగనతలంలోకి వచ్చిన పాక్ విమానాలను తరుముకుంటూ మిగ్-21 యుద్ధ విమానంలో బయలుదేరిన వింగ్ కమాండర్ అభినందన్ దురదృష్టవశాత్తు పాక్ క్షిపణి విమానంను తాకడంతో అందులో నుంచి చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పాక్ భూభాగంలో పడిపోవడంతో వారికి బంధీగా దొరికిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పాకిస్తాన్ అభినందన్ను విడుదల చేసింది. అటారీ వాఘా సరిహద్దుల్లో భారత వాయుసేన అధికారులకు పాక్ బలగాలు అభినందన్ను అప్పగించాయి.తిరిగి భారత్కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నవి అభినందన్ తొలిమాటలని అధికారులు తెలిపారు.
శుక్రవారం తమిళనాడు, విశాఖపట్నం పర్యటనలతో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ అభినందన్ను స్వాగతిస్తూ ఓ ట్వీట్ పోస్టు చేశారు. "వింగ్ కమాండర్ అభినందన్కు ఘన స్వాగతం పలుకుతున్నాను. నీవు చూపిన ధైర్యం, సంయమనంతో దేశం గర్వపడుతోంది. 130 కోట్ల మంది ప్రజలకు భారతవాయుసేన ఆదర్శంగా నిలుస్తోంది. వందేమాతరం" అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Welcome Home Wing Commander Abhinandan!
— Narendra Modi (@narendramodi) March 1, 2019
The nation is proud of your exemplary courage.
Our armed forces are an inspiration for 130 crore Indians.
Vande Mataram!
ఇదిలా ఉంటే భారత్తో శాంతి చర్చల కోసమే అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటించారు. అప్పటివరకు ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో జవాన్ల కాన్వాయ్పై దాడి చేసింది.ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానికదాడులు చేసిన విషయం తెలిసిందే.