ABP-CVoter Third Opinion Poll: 4 రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్లో ఆప్?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన మూడో ఓపీనియన్ పోల్స్ అంచనాలను వెల్లడించింది ఏబీపీ-సీ ఓటర్(సెంటర్ ఫర్ వోటింగ్ ఓపీనియన్, ట్రెండ్స్ ఇన్ ఎలక్షన్స్). ఈ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే తిరిగి అధికారం చేపట్టే అవకాశం ఉందని తేల్చింది. ఒక పంజాబ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని, హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో బీజేపీదే అధికారం
ఉత్తరప్రదేశ్ తోపాటు పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో తిరిగి బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని తెలిపింది. ఈ ఓపీనియన్ పోల్ ను డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించింది ఏబీపీ న్యూస్ సీఓటర్. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తర్వాత సీఎం అభ్యర్థిగా ముందున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి బీజేపీదే అధికారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 212-224 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారం చేపడుతుందని ఓపీనియన్ పోల్ తేల్చింది. ఇంతకుముందు 325 స్థానాల్లో గెలిచి బీజేపీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. గతంతో పోల్చితే బీజేపీకి సీట్లు తక్కువ కానున్నాయి. ఓటు షేర్ కూడా 41.4 శాతం నుంచి 40.4 శాతానికి తగ్గనుంది. యూపీలో రెండోసారి వరుసగా అధికారం చేపట్టే తొలి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలవనున్నారు.
ఇక సమాజ్ వాదీ పార్టీ కూటమికి 151-163 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. బీఎస్పీకి 12-24 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి 2-10 సీట్లు వస్తాయని తేల్చింది.
పంజాబ్ రాష్ట్రంలో హంగ్? లేదా కేజ్రీవాల్ పార్టీకి అధికారం
పంజాబ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జగరనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ కంటే ఆప్ కే ఎక్కువ సీట్లు రానున్నాయని సర్వే తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో 50-56 సీట్లు దక్కేవ అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 39-45 సీట్లు వస్తాయని పేర్కొంది. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 సీట్లు ఉండగా అధికారంలోకి రావాలంటే 59 స్థానాల్లో గెలుపొందాలి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి 0-3 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కానీ,
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని తెలిపింది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీకి 33-39 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 29-35 స్థానాలు దక్కే అవకావం ఉందని పేర్కొంది. బీజేపీకి 39.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 35.7 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. గత ఎన్నికల్లో బీజేపీ 57 స్థానాల్లో గెలుపొందడం గమనార్హం.
గోవాలోనూ బీజేపీదే అధికారం
గోవాలో మరోసారి బీజేపీ అధికారాన్ని కొనసాగించే అవకాశాలున్నాయని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 17-21 స్థానాలు దక్కే అవకాశం ఉంది. సీఎం ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో ముందుండటం గమనార్హం.ఆమ్ ఆద్మీ పార్టీకి 5-9 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచే అవకాశం ఉంది. టీఎంసీ పోటీ చేసినా పెద్ద ఫలితం ఉండదనే తెలుస్తోంది. కాంగ్రెస్-టీఎంసీ, ఎంజీపీ పొత్తు పెట్టుకుంటే ఫలితాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
మణిపూర్లోనూ బీజేపీనే కానీ
మణిపూర్ రాష్ట్రంలోనూ తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే తేల్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుందని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 29-33 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 23-27 సీట్లు, నాగా పీపుల్స్ ఫ్రంట్ కు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి.