చెన్నైలో కేఎస్ఆర్ టీసీ ఓల్వో బస్సు బూడిద, సినిమా ఫక్కీలో 44 మంది ఎస్కేప్!
చెన్నై: బెంగళూరు నుంచి చెన్నై బయలుదేరిన కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్ టీసీ) ఓల్వో బస్సు కాలి బూడిద అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా మంటలు వ్యాపించిన విషయం గుర్తించి నడిరోడ్డులో బస్సు నిలపివేసి అందులోకి ప్రయాణికులను కిందకు దించడంతో అందరూ ప్రాణాలతో బయపడ్డారు.
శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కేఎస్ఆర్ టీసీ ఓల్వో బస్సులో 42 మంది ప్రయాణికులతో సహ ఇద్దరు డ్రైవర్లు చెన్నై బయలుదేరారు. శనివారం ఉదయం చెన్నైకి ఐదు కిలోమీటర్ల దూరంలోని పునామలై బైపాస్ రోడ్డులో బస్సు వెనుక నుంచి మంటలు వ్యాపించాయి.
వెనుక వాహనాలులో వెలుతున్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అప్పటికే మంటలు బస్సు పైభాగానికి వ్యాపించాయి. విషయం గుర్తించిన బస్సు డ్రైవర్ నడిరోడ్డులో బస్సు నలిపివేశారు. గట్టిగా కేకలు వేసి ప్రాయాణికులను కిందకు దిగిపోవాలని చెప్పాడు.
బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకుదిగారు. మంటలు వ్యాపించడంతో బస్సు వెనుక భాగంతో పాటు సీట్లు మొత్తం కాలి బూడిద అయ్యాయి. ఒక గంట తరువాత చెన్నై నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్యూట్ వలన మంటలు వ్యాపించాయని చెన్నై అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కేఎస్ఆర్ టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.